మృతులు పరాయి రాష్ట్రమైనా సరే ఆదుకోండి: సీఎం జగన్‌ ఆదేశాలు | CM Jagan Announces Exgratia for Srikakulam Train Accident Victims | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం రైలు ప్రమాదం: బాధితుల్ని ఆదుకోవాలని సీఎం జగన్‌ ఆదేశాలు

Apr 12 2022 9:21 AM | Updated on Apr 12 2022 2:43 PM

CM Jagan Announces Exgratia for Srikakulam Train Accident Victims - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ నివేదించిన తాజా వివరాలను అధికారులు సీఎంకు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరణించిన వారిని గుర్తింపు కార్డులు ఆధారంగా ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందినవారుగా తేల్చారన్నారు. మిగిలిన ముగ్గురిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారు కూడా వేరే రాష్ట్రానికి చెందినవారై ఉంటారని, ఇదే విషయాన్ని అధికారులు తెలిపారని సీఎంకు వివరించారు. 

ఈ ఘటనలో గాయపడ్డ ఒక వ్యక్తిని అదే రైలులో శ్రీకాకుళం తీసుకు వచ్చారని, వెంటనే అతన్ని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకున్నారని వివరించారు. గాయపడ్డ వ్యక్తికి అందుతున్న వైద్యాన్ని కలెక్టర్‌ స్వయంగా రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపైనా కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌.. మరణించిన వారు పరాయి రాష్ట్రం వారైనా, మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలని, ఈ సహాయం వెంటనే అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

చదవండి: (శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి) 

Advertisement
 
Advertisement
Advertisement