రెండేళ్ల పాలన కానుక.. మరో రూ.4,400 కోట్ల అప్పు | Chandrababu Naidu government has once again taken out loans | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పాలన కానుక.. మరో రూ.4,400 కోట్ల అప్పు

Jun 3 2026 4:37 AM | Updated on Jun 3 2026 4:37 AM

Chandrababu Naidu government has once again taken out loans

బాబు సర్కారు రుణభారం రూ.3,47,095 కోట్లు

బడ్జెట్‌ అప్పు రూ.1,86,904 కోట్లు 

గ్యారెంటీ అప్పులు రూ.1,12,,804 కోట్లు 

అమరావతి అప్పులు రూ.47,387 కోట్లు 

ఇన్ని అప్పులు చేసినా సూపర్‌ సిక్స్‌లు లేవు.. సంక్షేమం కట్‌ 

సంపద సృష్టి శూన్యం.. అంతా ఆర్థిక విధ్వంసమే 

సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు సర్కారు మరోసారి అప్పుల మోత మోగించింది. తాజాగా మంగళవారం బడ్జెట్‌లో మరో రూ.4,400 కోట్ల మేర అప్పులు చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో రెండేళ్లలోనే చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు ఏకంగా రూ.3,47,095 కోట్లకు చేరాయి. ఇందులో బడ్జెట్‌ అప్పులే రూ.1,86,904 కోట్లు కాగా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,12,804 కోట్ల వరకు ఉన్నాయి. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో మరో రూ.47,387 కోట్లు అప్పులు చేశారు.  

రాష్ట్రాన్ని రాసిచ్చేసి...! 
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్లలోనే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ రాష్ట్రాన్ని భారీ రుణాల ఊబిలోకి నెట్టేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అందినకాడికి అప్పులు చేసి ఏమాత్రం ఫలితాలు ఇవ్వని రంగాలకు మళ్లించేశారు. రాష్ట్రాన్ని బ్యాంకులకు రాసిచ్చేశారు. మరోపక్క ప్రభుత్వ ఆస్తులతో పాటు ఏకంగా ఖజానానే తాకట్టు పెట్టేశారు. సంపద సృష్టించకపోగా అసమర్ధ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం దిశగా నెడుతున్నారు.

గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట, అమరావతి పేరుతో భారీగా అప్పులు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్‌ సిక్స్‌లు అమలు చేయలేదు. సంక్షేమం మాటే లేదు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రజల ఆదాయాన్ని, రాష్ట్ర రాబడులను పెంచే దిశగా చర్యలు శూన్యం. ఇవేమీ చేయకపోగా దారుణమైన అప్పులతో ముంచేశారు. సంపద సృష్టించి అన్ని హామీలు అమలు చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చాక అంతులేని అప్పుల భారాన్ని మోపారు.  

విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం.. 
అంతులేని అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా నిర్మించకపోగా గత ప్రభుత్వం చేపట్టిన కొత్త వైద్య కళాశాలల పనులను సైతం నిలిపేసింది. పీపీపీ పేరుతో వాటిని ప్రైవేట్‌ పరం చేస్తోంది. ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తెస్తూ వైఎస్సార్‌సీపీ హ­యాంలో చేపట్టిన మన బడి నాడు–నేడు పనులను సైతం చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. 

విద్యా రంగంలో కొత్తగా ఒక్క స్కూలు గానీ, కాలేజీ గానీ నిర్మాణం చేపట్టలేదు. రెండేళ్లలో చంద్రబాబు సర్కారు చేసిందల్లా వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన ఆస్తుల కల్పన పనులను నిలుపుదల చేయడంతో పాటు వాటిని ప్రైవేట్‌ పరం చేయడమే! వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేయగా అందులో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబి్ధదారులకు బదిలీ చేయడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement