మద్యం మసి పూసి.. సిట్‌ పోలీసుల ‘కసి’ | Chandrababu Naidu Govt Illegal Case On Raj Kasireddy, Arrested Him In Hyderabad While Coming For Investigation | Sakshi
Sakshi News home page

మద్యం మసి పూసి.. సిట్‌ పోలీసుల ‘కసి’

Apr 22 2025 5:05 AM | Updated on Apr 22 2025 9:57 AM

Chandrababu Govt illegal case on Raj Kasireddy

రాజ్‌ కసిరెడ్డిని విజయవాడ సీపీ కార్యాలయానికి తీసుకొచ్చిన సిట్‌ అధికారులు

విచారణకు హాజరవుతానని సందేశం పంపిన రాజ్‌ కసిరెడ్డి 

అందుకోసం విజయవాడ వస్తుంటే హైదరాబాద్‌లోనే అరెస్టు

రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు 

ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను బెదిరించిన సిట్‌ 

వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లను వేధించి అబద్ధపు వాంగ్మూలాల నమోదు 

అసలు కుంభకోణం జరగనే లేదన్న విజయసాయిరెడ్డి 

లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే పన్నాగం

సాక్షి, అమరావతి: అక్రమ కేసులు నమోదు చేయడం..లేని ఆధారాలు సృష్టించేందుకు బెది­రింపులు, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. రెడ్‌ బుక్‌ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్‌ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. 

ఇందులోభాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ పన్నాగం పరాకాష్టకు చేరింది. ఈ అక్రమ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన రాజ్‌ కసిరెడ్డిని సిట్‌ అధికారులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేయడమే దీనికి తాజా నిదర్శనం. విజయవాడలో సిట్‌ అధికారుల ఎదుట మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం వెనుక పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. 

గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న రాజ్‌ కసిరెడ్డిని శంషాబాద్‌ విమానాశ్రయంలోనే సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పినా వినిపించుకోకుండా తమ వాహనంలోకి ఎక్కించి విజయవాడకు తరలించారు. ఓ వైపు న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ సిట్‌ అధికారుల రాజ్‌ కసిరెడ్డిని హడావుడిగా అరెస్టు చేయడం వెనుక అసలు పన్నాగం ఇలా ఉంది. 

విచారణకు వస్తానంటే అరెస్టు ఏమిటో...? 
రెడ్‌బుక్‌ కక్ష సాధింపే తప్ప మరొకటి తమ ఉద్దేశం కాదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ కేసులో రాజ్‌ కసిరెడ్డిని సోమవారం హడావుడిగా అరెస్టు చేసిన తీరే అందుకు నిదర్శనం. మంగళవారం సిట్‌ విచారణకు హాజరవుతానని ఆయన సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. అయినా సోమవారం సాయంత్రం హడావుడిగా హైదరాబాద్‌లో అరెస్టు చేయల్సిన అవసరం ఏమిటి? అంటే ఆయనను విచారించడం.. వాస్తవాలు తెలుసుకోవడం తమ లక్ష్యం కాదని సిట్‌ తన చేతల ద్వారా వెల్లడించింది. 

అరెస్టు చేసి వేధించి.. ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రకు అనుకూలంగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే తమ అసలు కుట్ర అని తేల్చిచెప్పింది. రాజ్‌ కసిరెడ్డి విషయంలో సిట్‌ మొదటి నుంచీ అదే కుతంత్రంతో వ్యవహరిస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని ఆయనకు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. తనను ఏ విషయంలో విచారించాలని భావిస్తున్నారో తెలియజేస్తే తగిన సమాచారంతో వస్తానని ఆయన సిట్‌ అధికారులకు ఈ–మెయిల్‌ ద్వారా తెలిపారు. 

కానీ, ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా వెంటనే మరోసారి ఈ–మెయిల్‌ ద్వారా నోటీసులు పంపడం గమనార్హం. దాంతో రాజ్‌ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం అనంతరం విచారణకు స్వయంగా వస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రెండు రోజుల క్రితం ఓ ఆడియో సందేశం పంపించారు. ఇంతలో న్యాయ ప్రక్రియకు కాస్త సమయం పడుతుండటంతో ఇక తానే మంగళవారం విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని సోమవారం తెలిపారు. అంటే మంగళవారం ఆయన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వస్తారని తెలుసు. మరి రాజ్‌ కసిరెడ్డిని హైదరాబాద్‌లో సోమవారమే అరెస్టు చేయల్సిన అవసరం ఏమొచ్చింది?  

న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం 
ఈ అంశం ప్రసుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కూడా. తనకు జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ రాజ్‌ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోసం కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ రెండు ప్రస్తుతం ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు విచారణకు హాజరవుతాను.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రాజ్‌ కసిరెడ్డి చెప్పారు. అయినా సరే అరెస్టు చేయడం గమనార్హం. దీని వెనుక పోలీసుల పక్కా కుట్ర ఉందన్నది సుస్పష్టం బెదిరించి లొంగదీసుకునేందకునా..! 

ఇప్పటికే కుటంబు సభ్యులను తీవ్రంగా వేధించిన సిట్‌ 
రెడ్‌బుక్‌ కుట్రకు అనుకూలంగా రాజ్‌ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే సిట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయనను హడావుడిగా అరెస్టు చేసింది. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్‌ చీఫ్, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయనను బెదిరించి పూర్తిగా తమకు అనుకూలంగా లొంగదీసుకోవడమే సిట్‌ ప్రస్తుత లక్ష్యం. 

ఇప్పటికే ఈ కేసులో రాజ్‌ కసిరెడ్డి కుటుంబ సభ్యులను సిట్‌ అధికారులు కొన్ని రోజులుగా తీవ్రంగా వేధించి బెంబేలెత్తించారు. హైదరాబాద్‌లోని రాజ్‌ కసిరెడ్డి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులను కూడా బెదిరించి వేధించారు. ఆయన సన్నిహితుడు, ఎరేట్‌ హాస్పిటల్స్‌ అధినేత విజేయంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. 

ఈ విధంగా రాజ్‌ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం రాజ్‌ కసిరెడ్డి పైనే పూర్తి స్థాయిలో పోలీసు మార్క్‌ ప్రతాపం చూపించనున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను బెదిరిస్తున్నట్టు సమచారం.  

మొదటినుంచీ సిట్‌ తీరు అంతే.. 
అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్‌ మొదటి నుంచి కూడా దండనీతినే నమ్ముకుంది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో వేధించి సాధించింది. సిట్‌ అధికారుల బెదిరింపులపై ఆయన  మూడు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిట్‌ తీరు మాత్రం మారలేదు. వాసుదేవరెడ్డిని మూడు రోజుల పాటు గుర్తు తెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించి మరీ వేధించింది. 

తద్వారా తాము చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా ఒప్పించింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అదే రీతిలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ స్పెషల్‌ ఆఫీసర్‌ సత్యప్రసాద్, చిరుద్యోగి అనూషను కూడా సిట్‌ అధికారులు వేధించి బెదిరించి వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక విజయ సాయిరెడ్డి ఎంపీగా మరో మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా సరే కేవలం టీడీపీకి కూటమికి రాజ్యసభలో ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారు. 

ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆ సీటు గెలుచుకునేందుకు వైఎస్సార్‌సీపీకి తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు కుట్రలో భాగమే.  అసలు ఎలాంటి కుంభకోణం జరగనే లేదని విజయసాయిరెడ్డే సిట్‌ విచారణ అనంతరం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా సరే  అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి సిట్‌ అధికారులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతూ అధికారికంగా గూండాగిరీకి తెగిస్తున్నారు.  

కుట్రతోనే వక్రీకరణ 
ప్రైవేట్‌ కంపెనీల వ్యవహారంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? 
ఎలాంటి అవినీతి లేని ఈ వ్యవహారంలో నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ కొత్త కొత్త కట్టుకథలను తెరపైకి తెస్తోంది. అదాన్‌ డిస్టిలరీల ఏర్పాటుకు రూ.100 కోట్ల అప్పు ఇప్పించడం అంటూ వినిపించిన కథ తాజా వక్రీకరణ. తన అల్లుడు కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ అదాన్‌ డిస్టిలరీ ఏర్పాటునకు రూ.100 కోట్లు అప్పు ఇచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అరబిందో కంపెనీ అప్పు ఇచ్చింది. 

అదాన్‌ డిస్టిలరీస్‌ తీసుకుంది. అది రెండు కంపెనీల మధ్య వ్యవహారం. దేశంలో ఎన్నో ప్రైవేటు కంపెనీల మధ్య అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. దానిపై ఆ రెండు కంపెనీల్లో ఎవరూ కూడా ఫిర్యాదు చేయనే లేదు. మరి ఆ వ్యవహారానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ? ఆ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ ఈ కేసుకు ముడిపెట్టాలని యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. 

లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే.. 
దర్యాప్తు పేరిట సిట్‌ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్‌ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. 

అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43వేల బెల్ట్‌ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. 

ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరి మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి.   వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి..? ఇవ్వవనే ఇవ్వవు. 

ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్‌ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసును కొనసాగించడమే సిట్‌ ఏకైక విధానంగా మారింది. 

అసలు లేని కుంభకోణంపై అక్రమ కేసు నమోదు చేసి రాజ్‌ కసిరెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడం గమనార్హం. ఆయన కేవలం కొంత కాలం అదీ కోవిడ్‌ వ్యాప్తి ఉన్న రోజుల్లో పరిశ్రమల శాఖ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెన్యువల్‌ కూడా చేయనే లేదు. రాజ్‌ కసిరెడ్డికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానానికి ఎలాంటి సంబంధమే లేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement