సాక్షి, అమరావతి: ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ ప్రతి నెలా 1వ తేదీన ఇస్తామన్న చంద్రబాబు హామీ ఒక నెల ముచ్చటగానే మిగిలిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత తొలి నెల మాత్రమే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇచ్చింది. ఆ తరువాత నుంచి ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగులు, పెన్షన్ల కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నెల రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మాత్రమే సోమవారం వేతనాలు పడ్డాయి. మిగతా శాఖల ఉద్యోగులకు వేతనాలు పడలేదు.
మున్సిపాలిటీ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగికీ జీతాలు రాలేదు. పెన్షనర్లకు పెన్షన్లు కూడా పడలేదు. తక్కువ జీతాలతో పనిచేసే హోంగార్డులు, వీఆర్ఏలకు కూడా 1వ తేదీన జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కోనెల ఐదు, ఆరు తేదీలు వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, చంద్రబాబు హామీ ఒక నెలకే పరిమితమైందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెబుతున్నాయి. ప్రతి నెలా జీతాలు, పెన్షన్లకోసం 10వ తేదీ వరకు వేచిచూడాల్సి వస్తోందని ఉద్యోగులు, పెన్షనర్లు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3 వేల కోట్ల అప్పు చేయనుంది. ఆ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరేవరకు జీతాలకు, పెన్షన్కు ఆగాల్సిందేనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.


