సాక్షి,అమరావతి: గత ఎన్నికల్లో ‘సంపద సృష్టిస్తా..పేదలకు పంచుతా..’ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాల పెంపుపై దృష్టి పెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం విక్రయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ సమావేశంలో ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. గోవా తరహాలో బీచ్లలో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా సూర్యలంక, విశాఖ బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ షాక్స్ అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్లో అన్ని బీచ్లలో అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం బీచ్లలో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తోందని, శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.


