ఆక్వాకు షాక్‌! | Chandrababu government new moves aim to eliminate subsidized electricity for Aqua | Sakshi
Sakshi News home page

ఆక్వాకు షాక్‌!

Jun 11 2026 5:41 AM | Updated on Jun 11 2026 5:41 AM

Chandrababu government new moves aim to eliminate subsidized electricity for Aqua

విద్యుత్‌ సబ్సిడీకి.. నాణ్యత శాతంలో మెలిక

అమల్లోకి కొత్త నిబంధన 

62,101 కనెక్షన్లకు సబ్సిడీ ఎగ్గొట్టేందుకు చంద్రబాబు ఎత్తుగడ

ప్రతి ఆక్వా రైతుకూ రూ.1.50కే విద్యుత్‌ సరఫరా హామీ ఇప్పటికే బుట్టదాఖలు

ఇప్పుడు సబ్సిడీ మొత్తానికి మంగళం పాడేందుకు అడ్డగోలుగా జీవో 169

సాక్షి, అమరావతి: ఆక్వాకు సబ్సిడీ విద్యుత్‌ను ఎగ్గొట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఎలాంటి షరతలు లేకుండా.. జోన్, నాన్‌ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వాసాగు చేసే రైతులందరికీ యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని రెండేళ్లుగా అటకెక్కించిన చంద్రబాబు సర్కార్‌.. తాజాగా నాణ్యతా శాతం (పవర్‌ ఫ్యాక్టర్‌) అంటూ లేని కొత్త నిబంధనను ముందుకు తీసుకువచ్చింది. నాణ్యతా శాతం తక్కువగా ఉంటే విద్యుత్‌ వృధా జరిగినట్లు భావించి వారికి సబ్సిడీని ఎగ్గొట్టే అడ్డగోలు వ్యవహారానికి నాంది పలికింది. ఈ మేరకు తాజాగా 169వ జీవోను ప్రభుత్వం జారీ చేసింది.

ఎగనామానికి కుతంత్రం ఇలా...
» ఈ జీవో ప్రకారం.. అప్సడా చట్టం కింద రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 1,09,202.46 ఎకరాలను కొత్తగా జోన్‌ పరిధిలో నోటిఫై చేస్తారు. 
»  వీటి పరిధిలో ఉన్న 6 వేల కనెక్షన్లతో పాటు జోన్‌ పరిధిలో ఇప్పటికే ఉన్న మరో 6,500 కనెక్షన్లకు యూనిట్‌ రూ.1.50 చొప్పున త్వరలో  విద్యుత్‌ సబ్సిడీ వర్తింప జేస్తారు.  ఇందుకు రైతాంగం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 
»  అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సబ్సిడీ వర్తింపు విషయంలో కొత్త నిబంధన తీసుకురావడం జరిగింది. 
»  ఈ నిబంధన ప్రకారం విద్యుత్‌ వినియోగ నాణ్యత  శాతం 0.90 నుంచి 0.95 శాతం మధ్య విధిగా ఉండాలి. 
»  పవర్‌ ఫ్యాక్టర్‌ అనేది విద్యుత్‌ సమర్థ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఒక శాతం ఉంటే సమర్థవంతంగా వినియోగిస్తున్నట్టు. 0.95 శాతం అంటే మంచి స్థాయిలో ఉన్నట్టు. 90 శాతం అంటే ఆమోద యోగ్యమైన స్థాయిలో ఉన్నట్టుగా గుర్తిస్తారు. 
» 0.90 శాతం కంటే తక్కువగా ఉంటే విద్యుత్‌ వృథా ఎక్కువగా జరుగుతున్నట్టుగా భావిస్తారు. వాస్తవానికి ఆక్వా చెరువులన్నీ బహిరంగ ప్రదేశాల్లో ఉండడంతో, విద్యుత్‌ లైన్లన్నీ కిలో మీటర్ల మేర విస్తరించి ఉంటాయి. దీనివల్ల వృధా శాతం ఎక్కువగా ఉంటుందని విద్యుత్, ఆక్వా రంగ నిపుణుల విశ్లేషణ. ఈ నేపథ్యంలో వాస్తవానికి 0.70 నుంచి 0.80 మధ్య మాత్రమే నాణ్యతా శాతం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. 
»  ఈ తాజా నిబంధన తాజా విద్యుత్‌ సబ్సిడీకి అర్హత పొందిన 12,500 కనెక్షన్లకే కాదు.. ఇప్పటికే విద్యుత్‌ సబ్సిడీ పరిధిలో ఉన్న మరో 49,601 కనెక్షన్లకు.. అంటే మొత్తం 62,101 కనెక్షన్లకు  ఇబ్బందికరంగా మారింది.  

జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన భరోసా.. ఇప్పుడు ఏది? 
2024–25 ఆర్థిక సంవత్సరంలో 5.60 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగవుతుండగా, 3.33 లక్షల ఎకరాలకు విద్యుత్‌ సబ్సిడీ వర్తింప చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కొత్తగా మరో లక్ష ఎకరాల్లో సాగు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆక్వాకు సంబంధించి 68,134 కనెక్షన్లు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలోనే జోన్‌ పరిధిలోని 10 ఎకరాల లోపు విస్తీర్ణం కలిగిన ఆక్వా చెరువులకు సంబంధించి 54,072 కనెక్షన్లకు విద్యుత్‌ సబ్సిడీ వర్తింప చేశారు. కానీ చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో తొలి ఏడాది 50,092 కనెక్షన్లకు వర్తింప చేయగా, 2025–26లో కేవలం 49,601 కనెక్షన్లకు మాత్రమే విద్యుత్‌ సబ్సిడీ అమలు చేశారు. 

తాజాగా మరో 12,500 కనెక్షన్లకు విద్యుత్‌ సబ్సిడీ వర్తింప చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. ఎప్పుడు ఈ పెంపు వర్తింప చేస్తారో జీవోలో స్పష్టత లేకపోవడంపై ఒకవైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు నాణ్యతా శాతం అంశం తాజాగా రైతాంగానికి ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో  రెండేళ్లుగా సబ్సిడీ విద్యుత్‌ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆక్వా రైతులకు బాబు సర్కార్‌  శాపంగా మారింది.

రైతులను వంచించడమే..
చంద్రబాబు సర్కార్‌ ఆక్వారైతుల జీవితాలతో చలగాటమాడుతోంది.  జీవో 169  ఆక్వా రైతులను వంచించేందుకే తప్ప వారికి ఏమాత్రం మేలు చేయదు. వృధా శాతాన్ని అరికట్టి, నాణ్యతా శాతం పెంచుకోవాలంటే ప్రస్తుతం ఉన్న కెపాసిటర్ల స్థాయిని రైతులు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఒక్కో రైతుకు కనీసం రూ.2 లక్షల భారం పడనుంది.  ఓ వైపు కంపెనీలతో కుమ్మక్కై ఫీడ్‌ ధరలు పెంచేందుకు కుట్రలు చేస్తూ మరోక వైపు సబ్సిడీ విద్యుత్‌కు మంగళం పాడేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. –వడ్డి రఘురాం, మాజీ వైస్‌ చైర్మన్, అప్సడా 

Advertisement
 
Advertisement
Advertisement