నిర్ణయాధికారం ‘ఆమె’దే!  | Sakshi
Sakshi News home page

నిర్ణయాధికారం ‘ఆమె’దే! 

Published Thu, Jan 25 2024 5:46 AM

CEO Mukesh Kumar Meena released the voter list - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తేలింది. రాష్ట్రం మొత్తం ఓటర్లలో ఎలక్ట్రోలర్‌ లింగ నిష్పత్తి సగటు కూడా ఎక్కువగానే ఉంది. 

పదేళ్లుగా పెరుగుతున్న నిష్పత్తి
రాష్ట్రంలో 2014 నుంచి వరుసగా 2024 వరకు ఓటర్ల జాబితాల్లో మహిళా ఓటర్ల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. అర్హులైన యువతులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో 18 నుంచి 19 సంవత్సరాల వయసుగల ఎలక్ట్రోరల్‌ లింగ నిష్పత్తి 778 నుంచి 796కు పెరిగింది. ఈ వయసుగల మహిళా ఓటర్లు 3.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనుల్లోని ప్రత్యేక సంచార జాతులను కూడా ఓటర్లుగా నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రంలో వీరి జనాభా 4.29 లక్షలుండగా 18 సంవత్సరాలు నిండిన 2.94 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. బోడో గడబా, గుటోబ్‌ గడబా, చెంచు, బొండో పోర్జా, ఖోండ్‌ పోర్జా, పరేంగి పోర్జా, డోంగ్రియా ఖోండ్, కుటియా ఖోండ్, కోలం, కొండారెడ్డి, కొండ సవరాల జాతుల్లోని అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు.

Advertisement
Advertisement