ఐదేళ్ల వృద్ధి రేటు రయ్‌.. రయ్‌ | CAG report on the financial situation ending March 2023 released | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల వృద్ధి రేటు రయ్‌.. రయ్‌

Nov 23 2024 5:32 AM | Updated on Nov 23 2024 5:34 AM

CAG report on the financial situation ending March 2023 released

2018–19తో పోలిస్తే 2022–23లో 11.01% పెరుగుదల 

2018–19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.8,73,721 కోట్లు ఉండగా.. 2022–23లో రూ.13,17,728 కోట్లుగా నమోదు 

2022–23లో జీఎస్‌డీపీ 16.22% వృద్ధి 

2018–19 నుంచి 2022–23 వరకు రెవెన్యూ రాబడుల సగటు వార్షిక వృద్ధి రేటు 8.91 శాతం 

రెవెన్యూ రాబడుల్లో గ్రాంట్‌ 

ఇన్‌ ఎయిడ్‌ 2018–19లో 16.97%.. 2022–23లో 22.91 శాతం 

ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట నిబంధనలకు లోబడే రెవెన్యూ, ద్రవ్యలోటు 

2018–19 నుంచి 2022–23 మధ్య రాష్ట్ర తలసరి జీఎస్‌డీపీ వార్షిక వృద్ధి 9.90 శాతం 

2023 మార్చితో ముగిసిన ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదిక వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధి రేటు 2018–19తో పోలిస్తే 2022–23లో పెరిగిందని.. బడ్జెట్‌ లోపల చేసిన అప్పులు, ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు నిబ­ంధనలకు లోబడే ఉన్నాయని కం్రప్టోలర్‌ అండ్‌ ఆడి­టర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక స్పష్టం చేసింది. 2022–23 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదికను రాష్ట్ర ప్రభు­త్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది.

2018­–19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.8,73,721 కోట్ల నుంచి 2022–23లో రూ.13,17,728 కోట్లకు పెరిగి సగటు వార్షిక వృద్ధి రేటు 11.01 శాతంగా ఉందని కాగ్‌ స్పష్టం చేసింది. 2021–22 సంవత్సరంతో పోలిస్తే 2022–23లో జీఎస్‌డీపీలో 16.22 శాతం వృద్ధి నమోదైనట్టు కాగ్‌ వెల్లడించింది. ఈ కాలంలో పన్నుల ద్వారా ఆదాయం 9.25 శాతం, రాష్ట్ర సొంత పన్నుల ద్వారా ఆదాయం 9.93 శాతం మే­ర పెరిగా­యి. 

రాష్ట్ర మొత్తం వ్యయం 2021–­22లో రూ.1,77,647 కోట్ల నుంచి 2022–23లో రూ.2,10,272 కోట్లకు పెరగ్గా.. 18.35 శాతం పెరు­గు­ద­ల నమోదు చేసింది. తప్పనిసరి వ్యయం రూ.15,451 కోట్లు పెరగడం, స్థానిక సంస్ధలకు ఇచ్చే ఆరి్థక సహాయం రూ.14,208 కోట్లు పెరగడం, రూ.8,315 కోట్లు మేర సబ్సిడీలు పెరగడం రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణాలుగా కాగ్‌ తెలిపింది.  

వార్షిక రాబడులూ పెరిగాయ్‌ 
2018–19 నుంచి 2022–23 వరకు రెవెన్యూ రాబడులు సగటు వార్షిక వృద్ధి రేటు 8.91 శాతం పెరిగినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. రెవెన్యూ రాబడుల్లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వాటా 2018–19లో 16.97 శాతం ఉండగా.. 2022–23లో 22.01 శాతానికి పెరిగింది. 2018–19లో సబ్సిడీ వ్యయం రూ.2,352 కోట్ల నుంచి 2022–23లో రూ.23,004 కోట్లకు పెరిగిందని తెలిపింది. 

ఈ కాలంలో మొత్తం సబ్సిడీల్లో 43 శాతం నుంచి 88 శాతం వరకు విద్యుత్‌ రాయితీలే గణనీయంగా ఉన్నాయని పేర్కొంది. 2022–23లో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 3.30 శాతం పరిమితికి గాను 3.30 శాతం ఉందని, ద్రవ్యలోటు 4.50 శాతం పరిమితికి గాను 3.98 శాత ఉందని, రాష్ట్ర బకాయిల పరిమితి జీఎస్‌డీపీలో 36.30 శాతం పరిమితికి గాను 32.17 శాతం ఉందని కాగ్‌ వివరించింది. 

గ్యారెంటీల పరిమితి 180 శాతానికి గాను ఇచ్చిన హామీలు 92.24 శాతంగా ఉందని కాగ్‌ పేర్కొంది. బడ్జెటేతర రుణాల బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం బకాయిలు జీఎస్‌డీపీలో 41.89 శాతంగా ఉందని తెలిపింది. 

తలసరి జీడీపీ భారీగా పెరుగుదల 
2018–19లో తలసరి జీడీపీ రూ.1,70,180 ఉండగా.. 2022–23లో రూ.2,48,258కి పెరిగిందని కాగ్‌ వెల్లడించింది. 2022–23 నాటికి చెల్లించాల్సిన ప్రజా రుణం రూ.3,56,455 కోట్లు అని పేర్కొంది. ఈ మొత్తం బకాయిలు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో నిర్దేశించిన లక్ష్యాలకు లోబడే ఉన్నప్పటికీ బడ్జెటేతర రుణాలను, పెండింగ్‌బిల్లులు తీసుకుంటే లక్ష్యాల కన్నా బకాయిలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.

2023 మార్చి నాటికి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ.1,28,048 బడ్జెటేతర రుణాలను సేకరించినట్టు కాగ్‌ పేర్కొంది. తప్పనిసరి ఖర్చులు పెరిగిపోతున్నాయని కాగ్‌ తెలిపింది. ప్రధానంగా జీతాలు, వేతనాలు, పెన్షన్లు, స్థానిక సంస్థలకు నగదు బదిలీలు, వడ్డీ చెల్లింపు ఐదేళ్లలో భారీగా పెరిగినట్టు కాగ్‌ పేర్కొంది. పీఆర్‌సీ అమలు చేయడంతో ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పెరిగాయని కాగ్‌ స్పష్టం చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement