ఏలూరు జిల్లా: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు బుట్టాయిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరాజు సవాల్ విసిరారు. పోలవరం నియోజకవర్గంలో పెత్తందారులు తనని అణిచివేశారంటూ రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో పెత్తందారులు ఎమ్మెల్యేను అణిచివేస్తే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడా పెట్టాడని ఆదివారం బుచ్చిరాజు ప్రశ్నించారు. ‘‘విలాసవంతమైన ఇల్లు, స్కూళ్లు, రెస్టారెంట్లు, భూములు ఎలా సంపాదించాడు? పోలవరం ఏఎంసీ చైర్మన్ పదవి కోసం నన్ను రూ.50 లక్షలు అడిగింది నిజం కాదా? ఆ పెత్తందారులే లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడివా?
నువ్వు ఎమ్మెల్యే అవ్వడం కోసం వారి చుట్టూ ఎన్నిసార్లు తిరగలేదు? నియోజవర్గంలో జన సైనికులకు, వీర మహిళలకు నువ్వు ఏం న్యాయం చేశావ్? బుట్టాయిగూడెంలో మట్టి తవ్వకాలకు సంబంధించి జేసీబీలు, టిప్పర్లు రెవెన్యూ వాళ్లతో దాడులు చేయించింది నువ్వు కాదా..? ఆ తర్వాత ఒక్కో వాహనానికి రూ.2 లక్షలు వసూలు చేయలేదా?
నామినేటెడ్ పోస్టులు డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చావా...? నామినేటెడ్ పోస్టులు పొందిన వారిలో పార్టీ కోసం కష్టపడిన వారికి ఎంతమంది ఉన్నారు? నీపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించగలం. పెత్తందారులు నిన్ను అణిచివేశారని నువ్వు నిరూపించగలవా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.


