బీఆర్‌ నాయుడుకు టీటీడీ చైర్మన్‌ | BR Naidu appointed as TTD chairman: Andhra pradesh | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడుకు టీటీడీ చైర్మన్‌

Oct 31 2024 5:01 AM | Updated on Oct 31 2024 5:01 AM

BR Naidu appointed as TTD chairman: Andhra pradesh

23మంది సభ్యులతో టీటీడీ బోర్డు.. ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: టీవీ–5 అధినేత బీఆర్‌ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. ఆయనతోపాటు మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్లు బుధవారం టీడీపీ ప్రకటించింది. సభ్యులుగా జగ్గంపేట, కోవూరు, మడకశిర ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్‌ రాజు, టీడీపీ నేతలు పనబాక లక్షి్మ, సాంబశివరావు (జాస్తి శివ), నన్నపనేని సదాశివరావు, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్‌ కుమార్‌ నియమితులయ్యారు.

తెలంగాణ నుంచి నర్సిరెడ్డి, బుంగునూరు మహేందర్‌రెడ్డి, సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ బురగపు ఆనంద్‌సాయి, అనుగోలు రంగశ్రీ, భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన సుచిత్ర ఎల్లకు బోర్డు సభ్యులుగా అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్, దర్శన్‌ ఆర్‌ఎన్, గుజరాత్‌ నుంచి డాక్టర్‌ అదిత్‌ దేశాయ్, మహారాష్ట్ర నుంచి సౌరబ్‌ హెచ్‌ బోరా, తమిళనాడు నుంచి కృష్ణమూర్తిని నియమించారు. జనసేన కోటాలో తెలంగాణ నుంచి మహేందర్‌రెడ్డికి అవకాశం దక్కింది.

దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. కాగా ఈ జాబితాపై టీడీపీలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తమకు కచి్చతంగా బోర్డులో అవకాశం దక్కుతుందని భావించిన చాలామందికి నిరాశే ఎదురవడంతో వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేక వడపోతలు, సమీకరణలు పరిశీలించి చంద్రబాబు ఈ జాబితా రూపొందించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

వివాదాలకు కేంద్రబిందువు..! 
ఎల్లో మీడియా సిండికేట్‌లో భాగమైన టీవీ–5 అధినేత బీఆర్‌ నాయుడుకు టీటీడీ చైర్మన్‌ పదవి ఇస్తారని ముందు నుంచి అనుకుంటున్నదే. అయితే, బీఆర్‌ నాయుడు కనుసన్నల్లోనే ఆయన కుమారుడు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఆయన కుమారుడు ప్రాతినిథ్యం వహిస్తున్న హౌసింగ్‌ సొసైటీలో అవకతవకలు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో అక్రమాలు.. డ్రగ్స్‌ వినియోగదారులతో చెట్టాపట్టాలు.. హౌసింగ్, ‘రియల్‌’ వ్యాపారంపై తెలంగాణ హైకోర్టు ఆక్షేపణ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం చర్చనీయాంశంగా మారింది. 

వాస్తవానికి బీఆర్‌ నాయుడు నియామకంపై ఎన్నికల కంటే చాలా ముందే టీడీపీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కావాలనే బురదజల్లే కార్యక్రమాలు ప్రసారం చేశారని సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement