కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం: బొత్స | Botsa Satyanarayana on Visakhapatnam Steel Plant Tragedy | Sakshi
Sakshi News home page

కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం: బొత్స

Jun 9 2026 3:07 PM | Updated on Jun 9 2026 5:07 PM

Botsa Satyanarayana on Visakhapatnam Steel Plant Tragedy

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి (కేజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. వారిలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆ తర్వాత బొత్స సత‍్యనారాయణ అక్కడే మీడియాతో మాట్లాడారు.

ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమని బొత్స సత‍్యనారాయణ అన్నారు. పరిహారంపై బాధిత కుటుంబాలది గొంతెమ్మ కోరిక కాదని చెప్పారు. బాధితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. స్టీల్‌ ‍ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. 

ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు 
స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రల వల్లే స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదాలు జరగుతున్నాయని, ఆ విధంగా కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బొత్స ఫైర్‌ అయ్యారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆయన, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపు ఆపాలని తేల్చి చెప్పారు. ప్రమాదంలో దుర్మరణ చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్‌ తరహాలో కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ పరిహారం కోసం వైయస్సార్‌సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు.

‘‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్‌ ఆసుపత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున, అధినేత వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను తమ తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌లో సమర్థులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం వల్లే అనుభవజ్ఞుల కొరత ఏర్పడి, ఈ తరహా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్‌ఎస్‌ చర్యలను ఆపాలి’’ అన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ

మంత్రి లోకేశ్‌ తీరు దారుణం: కురసాల కన్నబాబు  
బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్‌.. సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయం చేయడం దారుణమని మాజీ మంత్రి కురసాల కన్నాబాబు అన్నారు. ‘‘నాడు ఎల్జీ పాలిమర్స్‌ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్‌తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. కానీ నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం’’ అని చెప్పారు.

కాగా, స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. భాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావు, నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుల మృతదేహాలను బంధువులకు అధికారులు అప్పగించారు. బిహార్‌కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 8 మంది  మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. 

Advertisement
 
Advertisement
Advertisement