రెండ్రోజులుగా ఆయనతోనే రక్తపరీక్షలు
గగ్గోలు పెడుతున్న రోగులు
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): స్థానిక సీహెచ్సీలో వైద్య సిబ్బంది కొరతతో ఇక్కడి సెక్యూరిటీ గార్డే రోగులకు రక్త పరీక్షలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రెండ్రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొనడంతో బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది కొరతతో సక్రమంగా వైద్యసేవలు అందడంలేదని.. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల గిరిజనుల పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైందని.. ఆసుపత్రికి రావాలంటే భయపడే పరిస్థితులు దాపురించాయని రోగులు గగ్గోలు పెడుతున్నారు.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోని సీహెచ్సీ, పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని.. లేకపోతే సెక్యూరిటీ గార్డులు, కిందస్థాయి సిబ్బంది అందించే సేవలలో ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇతరులు రక్త పరీక్షలు చేస్తుండగా కొందరు వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.


