వాస్తవాలను దాచిపెట్టి బాబు రాజకీయం | Bhumana Karunakar Reddy Fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

వాస్తవాలను దాచిపెట్టి బాబు రాజకీయం

Feb 3 2026 5:16 AM | Updated on Feb 3 2026 5:19 AM

Bhumana Karunakar Reddy Fires on CM Chandrababu

లడ్డూపై దు్రష్పచారాన్ని ప్రజలు నమ్మకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌: భూమన కరుణాకరరెడ్డి

సీబీఐ నివేదిక నుంచి దృష్టి మళ్లించేందుకే టీడీపీ హింసా రాజకీయాలు 

అంబటి రాంబాబుపై హత్యాయత్నం 

జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడి  

జంతు కొవ్వు లేదని ఎన్‌డీడీబీ–ఎన్‌డీఆర్‌ఐ నివేదికల్లో స్పష్టం 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు వాస్తవాలను దాచిపెట్టి భక్తుల విశ్వాసాలతో రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ చంద్రబాబు దు్రష్పచార కుట్రలకు పాల్పడటాన్ని తప్పుబట్టారు. ఎన్‌డీడీబీ నివేదికలో జంతు కొవ్వు లేదని సీబీఐ దాఖలు చేసిన చార్జిషిట్‌లో తేలడంతో ఆత్మరక్షణలో పడ్డ సీఎం, టీడీపీ–జనసేన నేతలు హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఎదురుదాడికి దిగారని మండి­పడ్డారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌ ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. తిరుపతిలోని క్యాంపు కార్యా­లయంలో మేయర్‌ డాక్టర్‌ శిరీష, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పుల్లయ్యతో కలిసి భూమన సోమవారం మీడియాతో మాట్లాడారు.  

దు్రష్పచారాన్ని నమ్మకపోవడంతో దాడులు.. 
యానిమల్‌ ఫ్యాట్‌ కలిసే అవకాశం లేదని ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టులో ఉందని చార్జిషీట్‌లో సీబీఐ చాలా స్పష్టంగా పేర్కొంది. ఏఆర్‌ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిపై కూడా ఎన్‌డీఆర్‌ఐ తన నివేదికలో జంతుకొవ్వు లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. 2024 జూలైలో నాటి ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌డీడీబీ నివేదికలో వెజిటబుల్‌ ఆయిల్‌ కలిపారని నివేదిక వచ్చిం దన్నారు.

అనంతరం సెప్టెంబర్ 23న.. ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందని వచ్చిందంటూ చంద్రబాబు ఒత్తిడితో ఈవో మాట మార్చారు. ప్రజలు తమ దు్రష్పచారాన్ని నమ్మకపోవడంతో నెయ్యిలో కల్తీ దొంగలు అంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలతో దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ముఠా 3 వేల మంది రౌడీ మూకలతో అంబటి ఇంటిపై దాడికి దిగి హత్యాయత్నానికి పాల్పడింది. అసాంఘిక శక్తులను ఉసిగొల్పి పెట్రోలు బాంబులు విసిరి జోగి రమేశ్‌ నివాసానికి నిప్పంటించారు. రాష్ట్రమంతటా ఇదే విధ్వంసకర రాజకీయాలకు సన్నద్ధం అవుతున్నారు.  

బాబు హయాంలోనే భోలేబాబాకు అనుమతి.. 
నెయ్యిలో జంతుకొవ్వు కల్తీ జరగలేదని సీబీఐ నివేదికలో తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో అప్పటి పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులు, ఉన్నతాధికారుల ప్రమేయం లేదని పేర్కొంది. టీడీపీ హయాం నుంచి ఉన్న కొద్ది మంది సాంకేతిక నిపుణులు నెయ్యి సరఫరాదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని అదే నివేదికలో స్పష్టం చేసింది. భోలేబాబా డెయిరీ 2018 వరకు హర్‌‡్ష ఫ్రెష్‌ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది.

 చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కంపెనీకి నెయ్యి సరఫరా టెక్నికల్‌ శాంక్షన్‌ ఇచ్చారు. కేజీ నెయ్యి రూ.291 చొప్పున సరఫరాకు అనుమతించారు. ఇక ప్రీమియర్‌ డెయిరీకి కూడా చంద్రబాబు హయాంలోనే అత్యధిక పర్యాయాలు నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భోలేబాబాను డిస్‌ క్వాలిఫై చేశాం. నాణ్యమైన నెయ్యిని సరఫరా చేసేలా కఠినమైన నిబంధనలు అనుసరించాం.

టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా..
సాహి, గిర్‌ లాంటి ఉత్తమ ఆవులను దాతల విరాళాల ద్వారా టీటీడీకి సమకూర్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే. ఆవుల ఉత్పత్తి కేంద్రంలో పెయ్య దూడలు జని్మంచేలా, టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎన్‌డీడీబీ సహకారంతో అప్పటివరకు అందుబాటులో లేని బీటా సైట్స్‌ టెరాలసిస్‌ టెస్ట్‌ మిషనరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి టెండర్లు పిలిచాం.

కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు వెనక్కి పంపినవి.. యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందని చంద్రబాబు చెబుతున్న నాలుగు ట్యాంకర్ల నెయ్యిని కూటమి ప్రభుత్వంలోనే వాడారు. అంటే మీరు చెబుతున్నట్లుగా.. మీ ప్రభుత్వ హయాంలోనే పందికొవ్వు నెయ్యితో తయారు చేసిన లడ్డూలు తయారు చేశారా? ఆ నాలుగు ట్యాంకర్లలో కలిసింది పందికొవ్వు కాదని సీబీఐ తేల్చి చెప్పినా.. చంద్రబాబు మాత్రం పదే పదే జంతు కొవ్వులు కలిశాయని ఆరోపణలు చేస్తున్నారు. మీ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని హింసను ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? మీకంటే దైవ ద్రోహి ఇంకెవరు చంద్రబాబూ?.  

Advertisement
 
Advertisement
Advertisement