ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి | Sakshi
Sakshi News home page

ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి

Published Wed, Jun 22 2022 9:00 AM

Atmakur Byelction Arrangement Were Completed - Sakshi

ఆత్మకూరు: ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. 

గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు, పోలింగ్‌ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్‌ కేంద్రాల్లో ఏపీఎస్‌పీ కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామన్నారు. మొత్తం జనరల్‌ స్టాఫ్‌ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్‌ అధికారులు 38 మంది మాస్టర్‌ ట్రెయినీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్‌ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు.

 ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్‌ఓలు, వలంటీర్ల సహకారంతో ఓటరు స్లిప్‌లు పంపిణీ జరిగిందన్నారు. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్‌లతో పాటు గుర్తింపు కార్డు ఓటరు ఐడీ లేదా ఆధార్‌ బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్ట్‌ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి రెండు విడతలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్, విద్యుత్‌ వసతులు ఏర్పాటు చేసినట్లు, సజావుగా పోలింగ్‌ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.   

ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!

Advertisement
Advertisement