హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం | Sakshi
Sakshi News home page

హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం

Published Thu, Jun 9 2022 4:59 AM

Appointment of GPs and AGPs in High Court Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకుగాను పలువురిని ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), ప్రభుత్వ సహాయ న్యాయవాదులు(ఏజీపీ)గా నియమిస్తూ అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జీపీగా నియమితులైన వారిలో గోడ రాజాబాబు, ఎల్వీఎస్‌ నాగరాజు, టీఎంకే చైతన్య, వేగి కొండయ్య నాయుడు, జీఎల్‌.నర్సింహారెడ్డి ఉన్నారు.

వీరిలో టీఎంకే చైతన్య సీఐడీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, రాజాబాబు ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. జీఎల్‌ నర్సింహారెడ్డి ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేయగా, ఆయనకు ఇప్పుడు జీపీ పోస్టు ఇచ్చారు. ఏజీపీలుగా నియమితులైన వారిలో కుంచె ఆనందరావు, బొల్లవరపు సత్యేంద్ర మణికుమార్, గటల రాజశ్రీ, టి.రాధారాణి, కరగంజి హేమంత్‌ కుమార్, వై.సుబ్బారావు, బి.ధరణీ కుమార్, షేక్‌ ఆసిఫ్, తాయి లక్ష్మీ పద్మజ, జి. ప్రశాంతి, విశ్వనాధ శక్తిధార్, వేలూరి భరత్‌ సురేందర్‌రెడ్డి ఉన్నారు.

వీరు మూడేళ్ల పాటు ఆయా పోస్టుల్లో కొనసాగుతారు. జీపీలకు నెలకు రూ.1 లక్ష, ఏజీపీలకు రూ.44 వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారు. కాగా, జీపీలకు శాఖలను కేటాయిస్తూ ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ బుధవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ, హోం శాఖలను రెండుగా విభజించారు. కొన్ని జిల్లాలకు చెందిన హోం శాఖ కేసులను మహేశ్వర్‌రెడ్డికి, మరికొన్ని జిల్లాలను చైతన్యకు అప్పగించారు.

రెవెన్యూ అసైన్‌మెంట్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఆంధ్ర ప్రాంతం  నాగేశ్వరరావుకు, రాయలసీమ ప్రాంతాన్ని  నర్సింహారెడ్డికి కేటాయించారు. రెవెన్యూ జనరల్‌ ఆంధ్ర ప్రాంతాన్ని సుభాష్‌కు, రాయలసీమ ప్రాంతాన్ని  బాలస్వామికి అప్పగించారు. వేగి కొండయ్యనాయుడికి వ్యవసాయం, సహకార శాఖ, రాజాబాబుకు గ్రామ, వార్డు సచివాలయాలు, నాగరాజుకు పాఠశాల విద్యాశాఖను కేటాయించారు.  

Advertisement
Advertisement