చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది
పూర్తి వివరాలతో కౌంటర్లు వేయండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: మద్యం, పొగాకు ఉత్పత్తులను చిన్నారులకు విక్రయించకుండా తీసుకొచ్చిన చట్టాన్ని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు ఘాటుగా స్పందించింది. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న హైకోర్టు, జువెనైల్ చట్టం ప్రకారం పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నేరమని గుర్తు చేసింది. ‘హెల్ప్ ది పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్’ చైర్మన్ కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ దాఖలు చేసిన పిల్పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం.. మద్యం, పొగాకు ఉత్పత్తులు అమ్మే షాపుల వద్ద హెచ్చరికల బోర్డును ప్రదర్శించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది.
పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం, హెచ్చరికల బోర్డుల ప్రదర్శనకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఆహార భద్రత మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, వైద్యఆరోగ్య శాఖ, హోం శాఖ, రెవెన్యూ (ఎక్సైజ్), పంచాయతీరాజ్, పురపాలక శాఖ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర డీజీపీ, జువెనైల్ సంక్షేమ డైరెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.


