
అమరావతి: మణిపూర్లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన ఆంధ్ర విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటున్నారు ఏపీ అధికారులు.
ఈ మేరకు పౌరవిమానయానశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రత్యేక విమానం ఏర్పాటుకు సివిల్ ఏవియేషన్ శాఖ అంగీకరించింది. ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయానశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 100 మంది ఏపీ విద్యార్ధులు మణిపూర్లో చదువుతున్నట్టు గుర్తించారు.