సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government Take Key Decision on Movie Tickets - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టికెట్లు విక్రయించేందుకే ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏపీఎఫ్‌డీసీ పోర్టల్‌ ‘యువర్‌ స్క్రీన్స్‌’ ద్వారా ఆన్‌లైన్‌ టికెట్ల విధానం అందుబాటులోకి రానుందని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్‌లైన్‌ విధానంతో థియేటర్ల యాజమాన్యాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దవుతాయన్న అపోహలు అక్కర్లేదని, పాత ఒప్పందాలు యథావిధిగానే కొనసాగుతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోర్టల్‌తో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన ‘యువర్‌ స్క్రీన్స్‌’ పోర్టల్‌ ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని థియేటర్లు కల్పించాలని, దీంతో ప్రేక్షకులకు తమకు నచ్చిన పోర్టల్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

అదనపు చార్జి చెల్లించకూడదనుకునేవారు ప్రభుత్వం తీసుకువచ్చిన ‘యువర్‌ స్క్రీన్స్‌’ పోర్టల్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకుంటారని పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు చేసిన విజ్ఞప్తి మేరకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. టికెట్ల డబ్బులు థియేటర్ల బ్యాంకు ఖాతాల్లో రోజువారీ ప్రాతిపదికన జమ చేస్తారని విజయ్‌కుమార్‌రెడ్డి వివరించారు. 

చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top