
ఏపీ ఫైబర్నెట్ చుట్టూ కమ్మేస్తున్న నిర్లక్ష్య మేఘాలు
రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన ప్రసారాలు
అస్తవ్యస్త ప్రసారాలతో వినియోగదారుల్లో అసంతృప్తి
రెన్యువల్ కాని నాలుగు లక్షల కనెక్షన్లు
సస్పెండ్ అయిన ఒక్కో బాక్సుకు రూ.59ను ఆపరేటర్ల నుంచి వసూలు చేస్తోన్న ప్రభుత్వం
విశాఖలో కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపిన కేబుల్ ఆపరేటర్లు
కూటమి సర్కారు తీరుతో రోడ్డున పడ్డ 35,000 కుటుంబాలు
సాక్షి, అమరావతి, బీచ్రోడ్డు(విశాఖ): ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థ చుట్టూ నిర్లక్ష్య మేఘాలు కమ్మేస్తున్నాయి. ప్రతిరోజూ ప్రసారాలను సమీక్షిస్తూ వ్యవస్థను చక్కదిద్దాల్సిన సంస్థలోని పెద్దల నిర్వాకం ఫైబర్ నెట్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఏపీ ఫైబర్ నెట్ ప్రసారాలు నిలిచిపోయాయి. సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడం, పాడైన బాక్సుల స్థానంలో కొత్త బాక్సులు అమర్చకపోవడంతో ఫైబర్నెట్ ప్రసారాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారి నుంచి నిత్యం తిట్లు, శాపనార్థాలు వినలేకపోతున్నామని కేబుల్ ఆపరేటర్లు వాపోతున్నారు. ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణం. కనీసం ఓ గంటపాటైనా ప్రసారాలు ఇవ్వలేకపోతున్నామని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీ ఫైబర్ నెట్ను గాలికి వదిలి నరకం చూపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో శనివారం విశాఖలోని ఏయూ దూర విద్య కేంద్రంలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని జేఏసీ నాయకులు ముట్టడించారు.
ఏడాదిలో ఒక్క సమీక్షైనా?
ఫైబర్నెట్ దుస్థితిపై సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ (ఏపీ ఎస్ఎఫ్ఎల్) ఉన్నతాధికారులకు ఎన్నో లేఖలు రాసినా సరైన పరిష్కారం లభించలేదని కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్కసారైనా సమీక్ష నిర్వహించలేదు.
కూటమిసర్కారు అస్తవ్యస్త నిర్వహణతో ఏపీ ఫైబర్నెట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోందని, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. దీంతో కేబుల్ ఆపరేటర్ల ఐక్య కార్యాచరణ కమిటీ విశాఖలో ఏపీ ఎస్ఎఫ్ఎల్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసనకు దిగింది.
అవాంతరాలతో లక్షల మంది దూరం
నిరంతర అంతరాయాలతో నాలుగు లక్షల మందికి పైగా వినియోగదారులు కనెక్షన్లను రెన్యువల్ చేయించుకోవడం మానేశారు. ఇలా కనెక్షన్లు సస్పెండ్ అవుతున్నాయి. దీంతో సస్పెండ్ అయిన ఒక్కో బాక్సు నుంచి ప్రతి నెలా రూ.59ను కేబుల్ ఆపరేటర్ల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఈ పరిణామం తమను మరింత కుంగదీస్తోందని కేబుల్ ఆపరేటర్లు కలత చెందుతున్నారు.
ఎండీ ప్రవర్తనపై పెదవివిరుపు
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ ఎండీ ప్రవర్తన ఉందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎండీ దగ్గర నుంచి స్పందన లేదని, తమ కష్టాలను గాలికి వదిలేసి విలాసాల కోసం విదేశాలకు వెళ్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఎండీ తన పదవికి రాజీనామా చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులకు ఫోన్ చేస్తే స్పందన లేదు
సమస్యలను చెబుతామని అధికారులకు ఫోన్ చేస్తే స్పందించటం లేదు. నాలుగు లక్షల మంది వినియోగదారులను కాపాడుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలి. అలా జరిగేంతవరకు మా నిరసన కొనసాగుతుంది. – నారాయణరావు, జేఏసీ అధ్యక్షుడు
డిమాండ్లు ఇవీ..
» సాంకేతిక సిబ్బందికి జీతాలు తక్షణమే చెల్లించాలి
» ఒక్కో బాక్స్పై రూ. 59 సస్పెండ్ చార్జీలను రద్దు చేయాలి
» తొలగించిన 850 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి
» సిగ్నలింగ్ వ్యవస్థను సరిచేయాలి నిరంతర ప్రసారాలు జరిగేలా చూడాలి
» ఏపీ ఫైబర్ నెట్లో మీడియా, దిగువ స్థాయి ఉద్యోగులపై కక్షసాధింఫులు మానుకోవాలి
» అవినీతికి పాల్పడిన వారినే శిక్షించాలి.. అంతే తప్ప వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు