నేటి నుంచి ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు 

AP EAMCET Counselling 2020 Web Options Start From Today - Sakshi

జనవరి 1న ఆప్షన్ల మార్పునకు అవకాశం 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో కీలకమైన ఎంపీసీ స్ట్రీమ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం (నేటి) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జనవరి 1న ఆప్షన్లను సవరించుకోవడానికి అవకాశం కలి్పస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 88,667 మంది అభ్యర్థులు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్‌ కానివారికి కూడా  ధ్రువపత్రాల పరిశీలనకు వీలు కల్పిస్తున్నారు. ఇలాంటివారు ఈనెల 28 నుంచి 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి సరి్టఫికెట్ల పరిశీలనలో పాల్గొనవచ్చు.

అభ్యర్థుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్‌లైన్‌ కేంద్రాలను జనవరి 1వ తేదీవరకు కొనసాగించాలని కనీ్వనర్‌ నిర్ణయించారు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లల ధ్రువపత్రాల పరిశీలనను ఈనెల 29న విజయవాడ పాలిటెక్నిక్‌ కాలేజీలో చేపట్టనున్నారు. రిజిస్టర్‌ అయి ఉన్న వారు మొబైల్‌ నంబరు మార్పు, లాగిన్‌ ఐడీ తదితర అంశాలపై హెల్ప్‌లైన్‌ కేంద్రాల సహకారం తీసుకోవచ్చు. ఇతర సమాచారం కోసం అభ్యర్థులు ‘హెచ్‌టీటీపీఎస్‌://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్‌’ను చూడవచ్చు. వెబ్‌ ఆప్షన్ల నమోదులో సమస్యలు ఎదురైతే వాటిని నివృత్తి చేసేందుకు కమిషనరేట్‌లో మూడు హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వాటికి ఫోన్‌చేసి తమ సందేహాలను పరిష్కరించుకోవచ్చు. 

జనవరి 1వ తేదీన అభ్యర్థులు తమ ఆప్షన్లలో పొరపాట్లు సవరించుకునే అవకాశం ఉంది. అనంతరం 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులకు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రయివేటుకు సంబంధించి 257 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,29,016 సీట్లు, 120 ఫార్మసీ కాలేజీల్లో 10,675 బీఫార్మసీ సీట్లు, 62 కాలేజీల్లో 1,860 డీఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా ఇంజనీరింగ్‌లో 82 కాలేజీలు, బీఫార్మసీలో 19 కాలేజీలు, డీఫార్మాలో 7 కాలేజీలు యూనివర్సిటీలకు వివిధ రుసుములు బకాయి ఉండడంతో వాటిలోని 35,347 ఇంజనీరింగ్, 1,660 బీఫార్మసీ సీట్లు, 210 డీఫార్మా సీట్లను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ఆ కాలేజీలనుంచి అఫిడవిట్లు తీసుకుని ఆ సీట్లను కూడా విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అవికూడా జత అయితే సీట్లసంఖ్య ఆ మేరకు పెరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ వర్సిటీల పరిధిలోని 18 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 5,212 సీట్లు, 9 బీఫార్మసీ కాలేజీల్లో 520 సీట్లు, 1 డీఫార్మసీ కాలేజీలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాక మిగిలిన సీట్లు ప్రయివేటు కాలేజీలకు సంబంధించినవి. 

4 లేదా 5 నుంచి తరగతులు 
ఈనెల 3వ తేదీ సాయంత్రానికి సీట్ల కేటాయింపు పూర్తిచేసి 4 లేదా 5వ తేదీనుంచి తరగతుల ప్రారంభించాలని సూచిస్తున్నాం. మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యాక రెండు, మూడో విడత సీట్ల కేటాయింపు చేస్తాం. ఎంపీసీ స్ట్రీమ్‌ సీట్ల కేటాయింపు పూర్తయ్యాక జనవరి 9 నుంచి బైపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌ చేపడతాం. ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కలి్పస్తాం. – ఎం.ఎం.నాయక్, అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ 

స్ట్రీమ్‌ కోర్సులకు వెబ్‌ ఆప్షన్లు
గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌ కోర్సులకు ఏపీ ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా  వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.గిరిధర్‌కృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు:  1,85,936 
ఎంసెట్‌కు హాజరైన వారు:                       1,56,953 
క్వాలిఫై అయిన వారు:                             1,33,072 

ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌ 
తేదీ                        ర్యాంకు నుంచి                  ర్యాంకు వరకు 
డిసెంబర్‌ 28, 29               1                           60,000 
డిసెంబర్‌ 30, 31          60,001                    చివరి వరకు 
జనవరి 1    ––    ఆప్షన్లలో సవరణ 
జనవరి 3    –      సీట్ల కేటాయింపు 

వర్సిటీల వారీగా అందుబాటులో ఉన్న వర్సిటీ, ప్రయివేటు సీట్లు మొత్తం 

యూనివర్సిటీ      ఇంజనీరింగ్‌      బీఫార్మసీ       డీఫార్మా     
ఏఎన్‌యూ             3,420          1,840          300 
జేఎన్‌టీయూఏ      38,637          3,285          780 
జేఎన్‌టీయూకే      81,757          3,360          480 
ఏయూ                 3,190          1,750          270 
కేయూ                   ––                 260            30 
ఇతర వర్సిటీలు       2,012            180    –– 
మొత్తం             1,29,016       10,675       1,860 

వర్సిటీల వారీగా జీరో అడ్మిషన్ల కాలేజీలు ఇలా

వర్సిటీ          ఇంజనీరింగ్‌         బీఫార్మసీ
ఏఎన్‌యూ            1                    ––
జేఎన్‌టీయూ–ఏ   21                    2
జేఎన్‌టీయూ–కే   26                    2
ఏయూ                ––                  1 

హైల్ప్‌లైన్‌ నంబర్లు: 8106876345, 8106575234, 7995681678 
ఈమెయిల్‌ ఐడీ: ‘సీఓఎన్‌వీఈఎన్‌ఈఆర్‌ఏపీఈఏఎంసీఈటీ2020:జీమెయిల్‌.కామ్‌’ను మెయిల్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top