విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో తప్పిన పెను ప్రమాదం | Another Accident in Vizag Steel Plant Details Here | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో తప్పిన పెను ప్రమాదం

Jun 11 2026 10:02 AM | Updated on Jun 11 2026 10:09 AM

Another Accident in Vizag Steel Plant Details Here

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరోసారి ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-1 (స్టీల్ మెల్టింగ్ షాప్-1) విభాగంలో ఉన్న ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్‌లో ద్రవ ఉక్కు (Molten Steel) ల్యాడిల్‌ నుంచి నేలపైకి పొర్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో  ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే ద్రవ ఉక్కు ఒక్కసారిగా ల్యాడిల్‌ నుంచి బయటకు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. లేకపోతే భారీ ప్రాణనష్టం సంభవించేదే.

ఘటన అనంతరం ప్లాంట్‌ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ద్రవ ఉక్కు లీకేజీకి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఇటీవల కూడా(సోమవారం) స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌ఎంఎస్‌-2 నుంచి సలసలా మరిగే ఉక్కు ద్రవం మీద పడి 9 మంది కార్మికులు మరణించారు. మరికొందరికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో..  భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనతో మరోసారి ప్లాంట్‌లో భద్రతా వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement