‘సచివాలయ’ ఉద్యోగులకు రాత పరీక్ష!

Andhra Pradesh: Written Test For Secretariat Employees - Sakshi

తొలి బ్యాచ్‌ ఉద్యోగులకు అక్టోబర్‌ 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి

నిబంధనల ప్రకారం పే స్కేలు అమలుకు ప్రభుత్వం చర్యలు

ముందుగా ఉద్యోగుల్లో ప్రావీణ్యత పెంపునకు రాత పరీక్ష

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల తొలి బ్యాచ్‌ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్‌ 2వ తేదీకి రెండేళ్ల సర్వీసు పూర్తవుతోంది. నిబంధనల ప్రకారం వారందరికీ ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి పే స్కేలు అమలు చేయనున్నారు. దీనికి ముందు వారికి శాఖ పరంగా æక్రెడిట్‌ బేస్‌ అసెస్‌మెంట్‌ పరీక్షను సెప్టెంబర్‌ 11 – 17 తేదీల మధ్య ఒక రోజు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. 90 నిమిషాల్లో వంద ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి, నాలుగు నెలల్లోనే వాటి భర్తీ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే.

వీరిలో 1.21 లక్షల మంది 9 ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వీరిలో తొలి బ్యాచ్‌కు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు శాఖలవారీగా సిలబస్‌ను నిర్ధారించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఆయా శాఖలకు శుక్రవారం లేఖలు రాశారు. ఏవైనా శాఖలు 65 ప్రశ్నల కేటగిరీలో రాతపరీక్షకు బదులు కేవలం ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని భావిస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాల తయారీ, మార్కుల వెల్లడి బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించినట్టు అజయ్‌జైన్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top