
విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చూడాలి
ఏపీ స్పేస్ పాలసీ–4.0 రూపకల్పనపై సమీక్షలో చంద్రబాబు
భవిష్యత్తు అంతా అంతరిక్ష రంగానికి : సోమనాథ్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: అంతరిక్ష రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపడంతోపాటు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ–4.0ని రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. లేపాక్షి స్పేస్ సిటీలో డిజైన్ అండ్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తిరుపతి స్పేస్ సిటీలో మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్ సేవలు అందించే సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ–4.0పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2025–2035 మధ్య కాలానికి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. విద్యాసంస్థలను భాగస్వాములను చేసి తద్వారా విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చూడాలని చెప్పారు. కమ్యూనికేషన్ రంగంలో అగ్రభాగాన ఉన్న సంస్థలను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని సూచించారు.
భవిష్యత్ స్పేస్ రంగానిదే: సోమనాథ్
ఈ సమావేశానికి వర్చువల్గా హాజరైన ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. స్పేస్ విజన్ పాలసీ–2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపారు. స్టార్ లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని, భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనన్నారు.
మూలధన వ్యయానికి ప్రాధాన్యం: సీఎం
మరోవైపు.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల లభ్యతపైనా ఆర్థిక శాఖ మంత్రి, అధికారులతో సీఎం సమీక్షించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చుచేయాలని చంద్రబాబు సూచించారు. సంక్షేమ పథకాలతోపాటు సంపద సృష్టికి, ఆదాయ ఆర్జనకు దోహదపడే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
డ్రగ్స్పై యుద్ధంలో అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తా..
ఇక గుంటూరులో ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ నుంచి మిర్చి దాబా వరకు గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నానని.. ఈ యుద్ధానికి ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తానని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగుచేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపామని.. ఇంకా అదే పనిచేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
గంజాయి, డ్రగ్స్ విక్రయించిన వారి ఆస్తులు జప్తు చేస్తామని చెప్పారు. గతంలో విశాఖ కేంద్రంగా గంజాయి రవాణాచేసి ఆంధ్ర బ్రాండ్ను దెబ్బతీశారని ఆరోపించారు. గంజాయి నిర్మూలనకు ప్రతిపక్షాలు ముందుకు రావాలని సీఎం కోరారు. ఇక డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాటుచేసిన ఈగల్ టాస్క్ఫోర్సుకు ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబరు 1972, వాట్సప్ నెంబరు 8977781972లకు ఫోన్చేసి సమాచారమివ్వాలని సీఎం చెప్పారు. కార్యక్రమంలో.. మాదకద్రవ్యాల నివారణకు పనిచేసిన వివిధ వ్యక్తులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు సన్మానించారు.