మా భూములివ్వం.. బాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది | Amaravati Capital Farmers fires on Chandrababu Govt in Front Of YS Jagan | Sakshi
Sakshi News home page

మా భూములివ్వం.. బాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది

Jun 3 2026 5:11 AM | Updated on Jun 3 2026 5:11 AM

Amaravati Capital Farmers fires on Chandrababu Govt in Front Of YS Jagan

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

రాజధాని ప్రాంత రైతుల స్పష్టీకరణ    

చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది

పచ్చని పంటలు పండే పొలాలను లాక్కుంటోంది 

మా ప్రమేయం లేకుండా దుర్మార్గంగా ప్లాట్లు వేస్తోంది 

లే అవుట్లు వేసి రిజిస్ట్రేషన్లూ చేస్తోంది 

పొలాలన్నింటినీ చెరువుల్లా తవ్వేస్తోంది 

తరతరాలుగా వస్తున్న భూములు పోతే మేమెలా బతకాలి? 

మాకు, మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోంది 

చంద్రబాబు తీరుతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం 

చంద్రబాబు, లోకేశ్‌ మా గోడు వినిపించుకోలేదు 

అందుకే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను కలిశాం 

ఆయన మా కష్టం విని నేనున్నానంటూ అండగా నిలిచారు 

న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు 

ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల రైతులు వెల్లడి  

సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు సర్కారు.. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ తమను వేధిస్తోందని, మూడు పంటలు పండే పచ్చటి భూములను ఇచ్చేదే లేదని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల రైతులు స్పష్టం చేశారు. తమ ప్రమేయం లేకుండానే లే అవుట్లు, ప్లాట్లు వేస్తోందని.. రిజిస్ట్రేషన్లు సైతం చేసేస్తోందని మండిపడ్డారు. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న తమకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ తమ గోడు ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ కష్టాన్ని వివరించామని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నేతృత్వంలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ కష్టాలను వివరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్‌ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. రెండో విడత భూసేకరణ పేరుతో రైతులను భయపెడుతున్నారని, ఉన్న అరెకరం పొలం ఇచ్చి తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. పెనుమాకలో మినీ రిజర్వాయర్‌ పేరుతో పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేసిందని చెప్పారు. పక్కనే భూ సేకరణకు భూములివ్వని రైతుల పొలాలను 20 అడుగుల లోతు వరకు చెరువుల్లా తవ్వేసి.. వ్యవసాయానికి పనికి రాకుండా చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారిపోయాయని చెప్పారు. తామంతా (రైతులు) ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం పొలాల్లో తవ్వేసిన మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే రాజధాని కోసం ఇళ్లు, పొలాలను ఇచ్చేసిన రైతులకు ప్రభుత్వం వాగుల్లో ప్లాట్లు కేటాయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.

ఎంత మంది రైతులను చంపేద్దామనుకున్నారు?
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్‌ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఉన్న అరెకరం పొలం ఇచ్చి కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అనుమతి లేకుండా రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేయడం దుర్మార్గం కాదా? భూసేకరణకు భూములివ్వని రైతుల పొలాల్లో 20 అడుగుల లోతున చెరువుల్లా తవ్వేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారాయి. డ్రెడ్జింగ్‌ చేసి ఇసుకను పక్కనే కుప్పలుగా పోశారు. రైతులు ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం రైతుల పొలాల్లో మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. మంచి ప్లాట్లు నేతలు తీసుకుని, రైతులకు వాగుల్లో ప్లాట్లు కేటాయించడం చూసి ఎంతో మంది బోరున విలపిస్తున్నారు. ఇలా అధికారులకు తన గోడు చెప్పుకుంటూనే ఓ రైతు గుండె పగిలి చనిపోయాడు. ఇప్పుడు రైతుల పొలాలను తవ్వేసి, ఇంకెంత మంది రైతులను ఇలా చంపేద్దామనుకుంటున్నారు? కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసం రైతుల జీవితాలను మట్టిపాలు చేయాలనుకోవడం చాలా తప్పు. బలవంతపు భూసేకరణ పేరుతో రైతులను వేధించడం ఇకనైనా ఆపాలి.  
– దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త

వైఎస్‌ జగన్‌ హామీతో ధైర్యం వచ్చింది
చంద్రబాబు ప్రభుత్వ తీరుతో తామంతా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని, ఈ ప్రభుత్వం తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని రాజధాని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను సీఆర్డీఏ కమిషనర్, మంత్రి లోకేశ్‌.. ఉండవల్లిలోనే ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని తెలిపారు. ఉన్న అరకొర భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశామన్నారు. తమ బాధలను సావధానంగా విన్న వైఎస్‌ జగన్‌.. అండగా ఉంటామని తమకు హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు. ఈ అన్యాయంపై రైతుల పక్షాన నిలబడి న్యాయస్థానాల్లో పోరాడతామని హామీ ఇచ్చారన్నారు. జగన్‌ హామీతో తమకు ధైర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వమే దగ్గరుండి రైతుల పొలాలను తవ్వేయడం, భూములు ఇవ్వని రైతుల పొలాల్లో వారి అనుమతి లేకుండా లే అవుట్‌లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలుసుకుని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారని తెలిపారు.

చంద్రబాబు, లోకేశ్‌ మా గోడు వినలేదు
నాకు ఉన్నదే కొంచెం భూమి. అందులో కొంత కృష్ణా నదిలో కొట్టుకుపోయింది. మిగిలింది సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌ అంటున్నారు. దాని పక్కనే బఫర్‌ జోన్‌ అంటున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌కి ఇవ్వని భూమిలో కూడా లేఅవుట్‌ వేశారు. నాకు భూమి మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. సీఆర్డీఏ కమిషనర్‌ మా మొర ఆలకించడం లేదు. మా ఎమ్మెల్యే లోకేశ్‌ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోనే ఉంటారు. మా రైతులను పిలిచి మా గోడు వినాలి. పచ్చని పంటలు పండే భూములు ఇవ్వడానికి మేం సిద్ధంగా లేము. ప్రభుత్వం స్పందించక పోవడంతో న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశాం. వైఎస్సార్‌సీపీ లీగల్‌గా అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.     
– శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి రైతు

భూములివ్వడం ఇష్టం లేదు
తరతరా­లుగా మేము అనుభవి­స్తున్న భూమిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. 12 ఏళ్లుగా ఇదే మాట మీదే ఉన్నా. ఈ భూమిని నమ్ముకునే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. అన్నం పెట్టే పొలాన్ని ఇవ్వడం మాకిష్టం లేదు. 
– శంకర్‌రావు, ఎర్రపాలెం రైతు

ప్రభుత్వం తీరుతో నిద్ర కరువు 
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కారణంగా మేం రోజూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇవ్వడం ఇష్టం లేదని మొత్తుకుంటున్నా నోటీసులు, నోటిఫికేషన్ల పేరుతో మమ్మల్ని అధికారులు వేధిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ హామీతో మాకు ధైర్యమొచ్చింది. 
– అశోక్‌ రెడ్డి, ఉండవల్లి రైతు

మా పొలాన్ని పనికి రాకుండా చేశారు
మా గ్రామ రైతులు ఏడాదంతా పూల తోటలు సాగు చేస్తారు. ఎకరం పొలంలో ఏడాదికి రూ.3–4 లక్షలు సంపాదిస్తాం. రెండెకరాలున్న రైతులు ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా తరతరాలుగా బతుకుతున్నారు. మొదటి విడత భూసేకరణకు పోను మా గ్రామంలో 450 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. మా సమ్మతి లేకుండానే ఆ భూముల్లో కూడా ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మా పొలాల చుట్టూ మెరక తోలేస్తున్నారు. వర్షాలు కురిస్తే నీరు నిలబడిపోయి ఆ పొలం వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఇలాగైతే మేం ఏం తిని బతకాలి?    
– శివరామ్, రైతు, నిడమర్రు 

Advertisement
 
Advertisement
Advertisement