
రూ.11 కోట్ల జప్తు డ్రామాపై కోర్టులో చెంపపెట్టు
వెంటనే సాయంత్రానికి రంగంలోకి సిట్, ఎల్లో మీడియా
అకస్మాత్తుగా తెరపైకి రూ.35 కోట్ల కట్టుకథ
చెవిరెడ్డి అనుచరుడిదిగా పేర్కొంటూ ఓ వీడియో విడుదల
ఇందులో రూ.2 వేల నోట్లు.. ఎన్నికల నాటి డబ్బుగా ఆరోపణలు
కానీ, అంతకు ఏడాది ముందే రూ.2 వేల నోట్లు వెనక్కుతీసుకున్న ఆర్బీఐ
సిట్ రూ.11 కోట్ల భేతాళ కథ ఫెయిల్తో రూ.35 కోట్ల కుట్ర కథ తెరపైకి
సాక్షి, అమరావతి: నిమిషానికో అబద్ధం... అరగంటకో ఎల్లో మీడియా లీక్... గంటకో కట్టుకథ..! మొత్తానికి రోజుకో భేతాళ విక్రమార్క కథ..! మద్యం అక్రమ కేసులో సిట్ బరితెగింపు ఇది. అరాచకంలో రోజురోజుకు అంచనాలను మించుతూ, అడ్డగోలుతనంలో పీహెచ్డీ చేస్తోంది దర్యాప్తు సంస్థ. అక్రమ కేసులో ఆరు నెలలుగా డ్రామాలతో రక్తి కట్టిస్తున్న సిట్.. శనివారం మరోసారి బరితెగించింది. ‘‘ఇంతకంటే దిగజారడం ఉండదని ఊహించిన ప్రతిసారి నా అంచనా తప్పని రుజువు చేస్తున్నావ్’’ అని అదేదో సినిమాలో చెప్పినట్లు.. భేతాళ విక్రమార్క కట్టుకథల్లో అన్ని రికార్డులను దాటేస్తోంది సిట్.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. గత బుధవారం హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని విజయేందర్రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో రూ.11 కోట్లు పట్టుబడినట్లు.. ఇదంతా మద్యం అక్రమ కేసు సొమ్మేనంటూ సిట్ ఓ కట్టుకథను తెరపైకి తెచ్చింది. ఈ నగదు జప్తు పేరిట సాగించిన హైడ్రామా విజయవాడ ఏసీబీ కోర్టులో తేలిపోయింది. మూడో కంటికి తెలియకుండా బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్ పన్నిన కుయుక్తి బెడిసికొట్టింది. మద్యం అక్రమ కేసు నిందితుడు రాజ్ కేసిరెడ్డి అభ్యర్థన మేరకు... రూ.11 కోట్లను ప్రత్యేకంగా భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్ల వివరాలను నమోదు చేస్తూ పంచనామా నిర్వహించాలని తేల్చి చెప్పింది.
మొత్తం ప్రక్రియను వీడియో తీయించాలని స్పష్టం చేసింది. కాగా ఈ నగదును రాజ్ కేసిరెడ్డి 2024 జూన్ నుంచే ఫామ్హౌస్లో ఉంచినట్టు సిట్ పేర్కొంది. కానీ, ఆర్బీఐ అధికారులు ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నోట్లు అన్నిగానీ వాటిలో కొన్నిగానీ 2024 జూన్ తరువాత ముద్రించినవి అని నిర్ధారణ అయితే సిట్ చెప్పిన జప్తు వ్యవహారం అంతా కట్టుకథేనని స్పష్టమవుతుంది. దీంతో సిట్ బండారం బట్టబయలవుతుంది. మొత్తానికి ఏసీబీ కోర్టు... సిట్కు చెంపపెట్టు లాంటి ఆదేశాలు జారీ చేసింది. అంతే... దీన్ని కప్పిపుచ్చేందుకు శనివారం సాయంత్రానికి సిట్తో పాటు ఎల్లో మీడియా రంగంలోకి దిగాయి. పన్నాగంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సన్నిహితుడు వెంకటేష్నాయుడు సెల్ఫోన్ నుంచి రిట్రీవ్ చేసినట్లుగా ఓ వీడియోను సిట్ తెరపైకి తెచ్చింది.
ఇదిగో కట్టుకథకు నిలువెత్తు సాక్ష్యం..
సిట్ తాజా కట్టుకథ ప్రకారం విడుదల చేసిన వీడియోలో... రూ.35 కోట్లు రిసీవ్ చేసుకున్నట్లు వెంకటేష్ నాయుడు వీడియో తీసుకున్నారు. ఈ డబ్బునే గత ఏడాది (2024) ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చు కోసం చెవిరెడ్డి వినియోగించారని సిట్ కట్టుకథలతో ఎల్లో మీడియా రంగప్రవేశం చేసింది. ఇది ఎంత డొల్ల వాదన అనేది ఇక్కడే బయటపడింది. ఎలాగంటే.. వెంకటేష్ నాయుడికి చెందిన నోట్ల కట్టలుగా చెబుతూ సిట్ విడుదల చేసిన వీడియోలో రూ.2 వేల నోట్లు ఉన్నాయి. కానీ, రూ.2 వేల నోటును 2023 మే 19నే రిజర్వ్ బ్యాంక్ వెనక్కుతీసుకుంది.
అంటే... ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే రూ.2 వేల నోటు చెలామణి లేదు. ఏడాది ముందుగానే చెలామణి ఆగిపోయిన నోట్లను ఎన్నికల సమయంలో ఎలా పంపిణీ చేశారనేది ప్రశ్నార్థకం. ఇదంతా చూస్తుంటే.. హైదరాబాద్లో రూ.11 కోట్ల జప్తు భేతాళ విక్రమార్క కథలు బెడిసికొట్టడంతో సిట్ రూ.35 కోట్ల డ్రామాను ముందుకుతెచ్చిందని స్పష్టం అవుతోంది.
⇒ కాగా, వెంకటేష్నాయుడు రియల్టర్. తన వ్యాపార లావాదేవీల్లో భాగమైన నగదును మద్యం అక్రమ కేసుకు సిట్ ముడిపెడుతోందని తేలుతోంది. కోర్టులో చెంపపెట్టులాంటి ఆదేశాలతో ప్రజల ను తప్పుదారి పట్టించేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. వెంకటేష్ నాయుడు అరెస్టు సమయంలో డబ్బుల కట్టల వీడియో ప్రస్తావనే లేదు. రిమాండ్ రిపోర్టు సమయంలోనూ ఈ విషయం రివీల్ చేయలేదు. కానీ, రూ.11 కోట్ల కుట్ర కథ ఫెయిల్తో హడావుడిగా వక్రీకరణలకు దిగిందనే విషయం తేటతెల్లం అవుతోంది.