
టీడీపీ ఎమ్మెల్యేల లీలలు..
శ్రీకాకుళంలో కేజీబీవీ ప్రిన్సిపాల్కు ఆమదాలవలస ఎమ్మెల్యే వేధింపులు
వీడియో కాల్ చేయాలని మహిళా ఉద్యోగులకు హెచ్చరికలు..
మాట వినకుంటే బదిలీ వేటు
కలకలం రేపిన గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ‘ముద్దు’ వీడియో
ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగిన పార్టీ మహిళా నేత..
ఈ పోలీసోళ్లతో నాకు న్యాయం జరగదు!
కళ్యాణదుర్గంలో నిండు గర్భిణి శ్రావణి బలవన్మరణం
టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఫిర్యాదును మార్చేశారని కన్నీరు..
మృతురాలి ఆడియో సోషల్ మీడియాలో వైరల్..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం పట్నం బజారు (గుంటూరు), కళ్యాణదుర్గం: దేశమంతా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటున్న వేళ.. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తుండటంతో మహిళలు రక్షణ కరువై అల్లాడుతున్నారు. పైశాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు. బాధ్యత మరిచిన టీడీపీ ప్రజాప్రతినిధుల విశృంఖల వైఖరితో మహిళలు బెంబేలెత్తుతున్నారు. కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతోంది. విద్యాధికులైన మహిళలను సైతం కామ పిశాచాలు వేధిస్తుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకుని కూర్చున్నారు!
కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా ఉద్యోగులు కార్యాలయాలకు రావాలంటే వణికిపోతున్నారు. రాత్రిపూట పార్టీ కార్యాలయాలకు పిలుస్తూ.. వీడియో కాల్స్ చేసి వేధింపులకు దిగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన అఘాయిత్యాలు.. గుంటూరు ఎమ్మెల్యే ‘ముద్దు’ వీడియోలు మహిళల పట్ల ఏడాది పాలనలో జరుగుతున్న దుశ్చర్యలకు మచ్చు తునకగా నిలుస్తున్నాయి.
‘కూన’ వీడియో కాల్స్...!
‘ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్ రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయాలకు రావాలని తన అనుచరులతో పిలిపిస్తారు. చాలాసేపు అక్కడే ఉంచుతారు. రాత్రి 10.30 దాటిన తర్వాత వీడియో కాల్ చేసి వేధిస్తుంటాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. సాధారణ కాల్స్ చేయరు. వీడియో కాల్ అయితేనే మాట్లాడతారని అనుచరులతో చెప్పిస్తారు. దుర్బుద్ధితోనే ఇదంతా... దారికి రాలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. నాలా నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలను కున్నా...!’
టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు ఎదుర్కొన్న పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆవేదన ఇదీ! దళితురాలిని తీవ్రంగా వేధించారంటూ బాధితురాలు కన్నీరు మున్నీరవుతున్నారు. కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఇద్దరు మనుషులను పంపించి కేజీబీవీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో తనకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయించినట్లు తెలిపారు. అధికారులు తనకు అండగా ఉండకపోగా ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారని వాపోయారు. కాగా గార, కంచిలి కేజీబీవీల ప్రిన్సిపాళ్లపై కూడా వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేయించి బదిలీలు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బలిపశువుని చేస్తున్నారు..!
గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ ‘ముద్దు’ దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తున్నారంటూ పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ శుక్రవారం ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పార్టీ నాయకురాలు గుడిపల్లి వాణితో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని సూఫియా మీడియాతో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్కృష్ణ స్వయంగా రికార్డ్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నసీర్కు చెప్పడంతో రెండు రోజులు మాట్లాడకుండా ఉండమన్నారని చెప్పారు. గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేసుకుని తనని ఇరికించే యత్నం చేస్తున్నారని చెప్పారు. నవీన్కృష్ణ ఫోన్లో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.
కళ్యాణదుర్గంలో గర్భిణి బలవన్మరణం..
‘భర్త, అత్త మామల వేధింపులు తాళలేక పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదు. నా ఫిర్యాదును పోలీసోళ్లు మార్చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నాకు అన్యాయం చేశారు..’ అని విలపిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిండు గర్భిణి శ్రావణి (22) ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన దయనీయ పరిస్థితిని ఫోన్లో ఆడియో రికార్డ్ చేసి తనువు చాలించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా... శుక్రవారం ఉదయం మృతురాలి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదా..?
కళ్యాణదుర్గానికే చెందిన శ్రీనివాసులుతో మూడేళ్ల క్రితం శ్రావణికి వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త,అత్త మామలు తరచూ వేధించడంతో కళ్యాణదుర్గం పోలీస్లకు ఫిర్యాదు చేసినట్లు శ్రావణి పేర్కొంది. స్థానిక టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ వైపీ రమేష్, మాజీ వైస్ చైర్మన్ శర్మస్ వలి ఒత్తిళ్లతో సీఐ దీన్ని మరో రకంగా మార్చేసి భర్త, అత్తమా మలకు అనుకూలంగా వ్యవహరించారని ఆడియోలో మృతురాలు కన్నీరు మున్నీరైంది.
కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నామని, కనీసం తన మొదటి బిడ్డకైనా (రెండేళ్ల చిన్నారి) న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ప్రభుత్వంలో ఇక న్యాయం జరగదా? అని ఆక్రోశించింది. ఈమేరకు ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి పుట్టింట్లో ఉరేసుకుని తనువు చాలించింది. దీనిపై పట్టణ సీఐ యువరాజును వివరణ కోరగా.. మృతురాలు ఆరోపించినట్లుగా తాము నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు.