సైబర్‌ వల.. చిక్కితే విలవిల.. | 76 cyber crime cases registered in Anakapalle district last year | Sakshi
Sakshi News home page

సైబర్‌ వల.. చిక్కితే విలవిల..

Jan 22 2026 5:26 AM | Updated on Jan 22 2026 5:26 AM

76 cyber crime cases registered in Anakapalle district last year

అనకాపల్లి జిల్లాలో సైబర్‌ నేరాలు పరిశీలిస్తే.. 

2023లో 52 కేసులు నమోదు 

2024లో 61 సైబర్‌ కేసులు  

2025లో 76 సైబర్‌ కేసులు  

ఖాతాల నుంచి క్షణాల్లో మాయవుతున్న డబ్బులు

గతేడాదిలో అనకాపల్లి జిల్లాలో 76 కేసుల నమోదు 

ఈ కేసుల్లో ఇప్పటివరకు రూ. 94 లక్షలు ఫ్రీజ్‌ 

వీటిలో 17 కేసుల్లో రూ.15,45,234 బాధితులకు చెల్లింపు 

నర్సీపట్నంలో నకిలీ పోలీస్‌ పేరిట రూ.1.43 కోట్ల మోసం

సాక్షి, అనకాపల్లి : ఒకరు కాదు..ఇద్దరు కాదు.. చాలా మంది సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అవగాహన లేకపోవడంతో కొందరు మోసపోతే..అవగాహన ఉండి నిర్లక్ష్యంతో మరికొందరు మోసపోతున్నారు. అత్యాశతో ఉన్నవారిని పార్ట్‌టైం, పుల్‌టైం ఉద్యోగాలు, వర్క్‌ ఫ్రమ్‌ హోం అంటూ ఆన్‌లైన్‌లో ఫేక్‌ లింక్‌లు పెట్టి ..వాటిని క్లిక్‌ చేసేలా ఆశ చూపించి ప్రలోభ పరిచి సైబర్‌ నేరగాళ్లు మోసం చేస్తారు. ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారు.  

సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్‌ మోసాలు కూడా కుప్పలుతెప్పలుగా పెరిగిపోతున్నాయి. డిజిటల్‌ లావాదేవీలలో తలెత్తే సమస్యల పరిష్కారాల కోసం గూగుల్లో, యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసుకునేవారిని ఫేక్‌ వీడియోలను యూట్యూబ్‌ల్లో ఫోస్టు చేసి ట్రాప్‌ చేస్తున్నారు. గూగుల్లోనే ఫేక్‌ యాప్‌లు, ఫేక్‌ లింక్‌లు అప్‌లోడ్‌చేసి మొత్తం డేటాని తస్కరిస్తున్నారు. 

ఇటువంటి కేసులు పెరిగిపోవడంతో సైబర్‌ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. నగదు రహిత డిజిటల్‌ లావాదేవీలలో ఎటువంటి సమస్య తలెత్తినా బ్యాంక్‌కి వెళ్లి సంప్రదించాలే తప్ప గూగుల్‌లో సెర్చ్‌ చేయొద్దంటూ వివరిస్తున్నారు. 

సురక్షితమైన లావాదేవీలు ఇలా... 
» ఎవరితో కూడా బ్యాంక్‌ లావాదేవీలకు సంబంధించి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్, యూపిఐ పిన్, ఓ­టీపీ, ఏటీఎం, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు వివరా­లు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచి ది.  
» డిజిటల్‌ లావాదేవీలకు బార్‌కోడ్‌లు, క్యూఆర్‌ కోడ్‌లు స్కానింగ్‌ లేదా ఎంపిన్‌ని లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి. 
» ఏదైనా ఫోన్‌కాల్, ఈ–మెయిల్‌ చేసి మీ కేవైసీ అప్‌డేట్‌ చేయాలని వివరాలు అడిగినా చెప్పవద్దు. ఒక వేళ అలాంటి అనుమానాలుంటే బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవాలి. హోం బ్యాంక్‌ శాఖను సంప్రదించాలి. 
» ఈమెయిల్‌లు, ఎస్‌ఎంఎస్‌లలో  యూఆర్‌ఎల్, డొమైన్‌ పేర్లను స్పెల్లింగ్‌ లోపాలుంటే జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ఇవి ‘హెచ్‌టీటీపీఎస్‌’తోప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కోసం అధికార వెబ్‌సైట్‌లనే ఉపయోగించాలి. 
» ఏదైనా వెబ్‌సైట్, అప్లికేషన్‌లో మీ ఈమెయిల్‌ను యూజర్‌ ఐడీగా నమోదు చేస్తున్నప్పుడు మీ ఈ– మెయిల్‌ పాస్‌వర్డ్‌ను ‘పాస్‌వర్డ్‌’ అని పెట్టుకోవద్దు.  

94 కేసుల్లో రూ.93.74 లక్షలు ఫ్రీజ్‌..  
అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు రూ. 93,78,304 మొత్తాన్ని ఫ్రీజ్‌ చేశారు. అలాగే రూ.15,45,234 మొత్తాన్ని 17 కేసుల్లో బాధితులకు తిరిగి చెల్లించడం జరిగింది. మిగతా కేసుల్లో కూడా పోలీస్‌ అధికారులు నిష్టతో పనిచేస్తూ బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు.. సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సీఐడీ, ఈడీ లేదా పోలీస్‌ అధికారి అంటూ ఫోన్‌ చేసి..మీ పేరు మీద అక్రమ పార్శిల్‌ వచ్చిందని భయపెట్టి వీడియో కాల్‌ ద్వారా నిర్బంధించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. 

ఇలా ఎవరైనా మోసానికి గురైతే మొదటి గంటలోనే 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలి. అప్పుడే ఆయా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు ఫ్రీజ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని కేసుల్లో బాధితులకు ఇప్పటికే అప్పగించాం. మిగతా కేసుల్లో కూడా బాధితులకు నష్టపోయిన వాటిని రికవరీ చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. పండగల సమయాల్లో నకిలీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌ల ద్వారా తక్కువ ఆఫర్‌లు ఇస్తూ.. సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుంటారు. వాటిపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.   – తుహిన్‌ సిన్హా, ఎస్పీ, అనకాపల్లి జిల్లా

డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తామంటూ భయపెట్టారు.. 
నర్సీపట్నంకు చెందిన ఒక వృద్ధుడు సైబర్‌ మోసానికి గురయ్యాడు. ముంబై నుంచి పోలీసులమంటూ ఫోన్‌ చేసి ..నీ బ్యాంక్‌ ఖాతాలో అనాథరైజ్డ్‌గా రూ.2 కోట్ల వరకు నగదు బదిలీ అయింది. తక్షణమే వాటిని రిటర్న్‌ చేయకపోతే నిన్ను అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించారు. తక్షణమే నీ బ్యాంక్‌ ఖాతా వివరాలన్నీ చెప్పండి..చెక్‌ చేస్తాం.. లేదంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందంటూ నలుగురు సైబర్‌ నేరగాళ్లు మాట్లాడారు. 

వారి మాటలు నమ్మి బ్యాంక్‌ ఖాతా వివరాలు చెప్పడంతో రూ.కోటి 43 లక్షల వరకూ తస్కరించారు. దీంతో ఆ వృద్ధుడు అప్రమత్తమై సైబర్‌ హెల్ప్‌లైన్‌ (1930)కు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా తక్షణమే ఆ సైబర్‌ నేరగాళ్ల బ్యాంక్‌ అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేశారు. ఎవరైతే బెదిరించి తస్కరణకు పాల్పడ్డారో ఆ సైబర్‌ నేరగాళ్లను కూడా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో బాధితుడు పోగొట్టుకున్న నగదును రికవరీ చేశారు.  

ఆన్‌లైన్‌ ఉద్యోగం పేరుతో మోసం.. 
అనకాపల్లి టౌన్‌లో గల గవరపాలేనికి చెందిన మణికంఠ అమెజాన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. వాట్సాప్‌లో కంపెనీ పేరుతో ఒక లింక్‌ వచ్చింది. ఇది పార్టు టైమ్‌ ఉద్యోగమని..ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పడంతో ముందుగా రూ.1,000తో రిజి్రస్టేషన్‌ చేసుకోమని చెప్పారు. అనుమానం వచ్చినా.. పోతే రూ.వెయ్యే కదా అని ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. 

ఆ విధంగా చేసిన మణికంఠకు కొద్ది రోజుల్లోనే రూ.1,400 పంపించాడు. దీంతో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం బావుందని నమ్మిన మణికంఠ అలా దపదఫాలుగా రూ.1.80 లక్షలు వరకూ వారికి పంపిస్తూనే ఉన్నాడు. అటు నుంచి ఒక్క రూపాయీ రాలేదు. దీంతో మోసపోయానని గమనించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి మణికంఠ ఖాతా నుంచి వెళ్లిన డబ్బులో రూ.1.20 లక్షలు ఫ్రీజ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement