నాడు: రాష్ట్రం గంజాయిమయంగా మారింది. నేను అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో గంజాయి బ్యాచ్పై ఉక్కుపాదం మోపుతా. – 2024, మే 10న ఏలూరులో ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు
నేడు: అల్లూరి జిల్లాలో 749 కిలోల గంజాయి లభ్యం
పాడేరు: ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే గంజాయిని పూర్తిగా అరికడతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నిత్యం రాష్ట్రంలో గంజాయి సరఫరా అవుతూనే ఉంది. తాజాగా, అల్లూరి జిల్లాలో 749 కిలోల గంజాయి పట్టుబడింది. ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు పంచాయతీ సంగవలస గ్రామ శివారు కొండ ప్రాంతంలో ఈ నెల 24న రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు.
కొండ మధ్యలో ఉన్న కాఫీ తోటల్లో భారీ గంజాయి నిల్వల కేంద్రాన్ని గుర్తించారు. కాఫీ తోటల పొదల మధ్యన 39 గన్నీ బ్యాగుల్లో నింపిన గంజాయి మూటలను బయటకు తీశారు. వాటికి తూకం వేయగా 749 కిలోలుగా తేలింది. దీని విలువ రూ.37,45,000 ఉంటుందని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. స్మగ్లర్లు, సరఫరాదారులు, రవాణాదారులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు.


