
దేశంలోని నదుల్లో 6,327 డాల్ఫిన్లు గుర్తింపు
వాటి రక్షణపై ఆందోళనలు
దేశంలో నదీ డాల్ఫిన్ల సంఖ్య ఒక పక్క పెరుగుతున్నా, మరోవైపు వాటి మనుగడ సైతం ప్రశ్నార్థకమవుతోంది. ఉత్తర భారతంలోని గంగా, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలే ప్రధానంగా వీటికి ఆవాసంగా ఉన్నాయి. తాజా సర్వే ప్రకారం, దేశీయ నదుల్లో 6,327 డాల్ఫిన్లను గుర్తించారు. వీటిల్లో రెండు రకాలుృ గంగాటిక్ , సింధు డాల్ఫిన్లుగా పరిగణిస్తున్నారు. ఈ జాతులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించడం ఆందోళన కలిగిస్తోంది. - సాక్షి, అమరావతి
నదుల్లోకి ఎలా?
మిలియన్ ఏళ్ల క్రితం ఇవి సముద్ర డాల్ఫిన్ల నుంచి ఉద్భవించినట్టు భావిస్తున్నారు. ఒకప్పుడు దక్షిణాసియాలో లోతట్టు ప్రాంతాలను సముద్రాలు ముంచెత్తినప్పుడు, ఈ డాల్ఫిన్లు నదుల్లోకి చేరుకున్నట్టు అంచనా. సముద్రంలో నివసించే డాల్ఫిన్ల నుంచి తమకు తాము వేరుచేసుకుని నివసించగలిగే లక్షణాలను అభివృద్ధి చేసుకున్నట్టు తెలుస్తోంది. సముద్రంలోని డాల్ఫిన్లకు గంగా నది డాల్ఫిన్లకు కొన్ని అంశాల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. నది డాల్ఫిన్లు నీటిలో ఎగసి దూకలేవు. నిటారుగా కూడా ఈత కొట్టలేవు. పక్కకు ఈదుతాయి. ఎక్కువ సేపు నీటి అడుగు భాగానే ఉంటాయి. పొడవైన ముక్కు కలిగి, దాదాపు దృష్టి సామర్థ్యం తక్కువతో మనుగడ సాగిస్తాయి.
జాతీయ జల జంతువుకు సమస్యలు..
» ఆనకట్టల నిర్మాణం.
» డాల్ఫిన్లను వాటి మాంసం, బ్లబ్బర్ (మందపాటి కొవ్వు పొర) కోసం వేటాడుతున్నారు. వాటి నుంచి నూనెలు తీసి చేపలు పట్టడానికి ఎరగా ఉపయోగిస్తున్నారు.
» చేపల వేట తీగల్లో చిక్కుకుని కొన్ని మృత్యువాత పడుతున్నాయి.
» గత దశాబ్దంగా పుంజుకుంటున్న నది క్రూయిజ్ పర్యాటకం. క్రూయిజ్ల నుంచి వచ్చే శబ్దాలను తట్టుకుని డాల్ఫిన్లు మనుగడ సాగించడం కష్టంగా మారుతోంది. చైనాలోని యాంగ్జీ నదిలో బైజీ డాల్ఫిన్ల విషయంలో ఇదే జరిగింది.
»దృష్టి సామర్థ్యం సరిగా లేకపోవడంతో ఈ డాల్ఫిన్లు నెమ్మదిగా ఈత కొడతాయి. ఫలితంగా పడవలను ఢీకొనే అవకాశం ఎక్కువగా ఉంటోంది.
» దేశ వన్యప్రాణుల చట్ట ప్రకారం డాల్ఫిన్లకు హాని తలపెడితే కఠిన శిక్షలు విధిస్తారు. ఫలితంగా వీటి మరణాలపై జాలరులకు సమాచారం తెలిసినప్పటికీ, కేసులకు భయపడి రిపోర్టు చేయడం లేదు.
» పునరుత్పత్తి చక్రం నెమ్మదిగానే ఉంటోంది. ఇవి 6ృ10 సంవత్సరాలకు మధ్య పరిపక్వం చెందుతున్నాయి. ప్రతి రెండు నుంచి మూడేళ్లకు ఒక జీవికి మాత్రమే జన్మనిస్తాయి.
ఊరటనిచ్చే అంశమే అయినా...
2009లో గంగా నది డాల్ఫిన్ల పరిరక్షణ ధ్యేయంగా కేంద్రం దీనిని జాతీయ జల జంతువుగా ప్రకటించింది. 2020లో సర్వే కార్యాచరణ ప్రణాళిక, 2024లో ప్రత్యేక పరిశోధనా కేంద్రం ఏర్పాటు వంటి చర్యలతో వాటి సంఖ్యను పునరుద్ధరించడంలో అడుగులు పడ్డాయి. ఒకప్పుడు 10 వేలు ఉండే డాల్ఫిన్ల సంఖ్య గత శతాబ్దంలో 2 వేలకు పడిపోయింది. అయితే వాటి ప్రస్తుత సంఖ్య కొంత ఊరటనిస్తోంది. వాటి మనుగడ ప్రశ్నార్థకమే ఇప్పుడు సమస్య.
2021 నుంచి 10 రాష్ట్రాల్లో 8,507 కిలోమీటర్ల పొడవున 28 నదుల్లో పడవల ద్వారా, 30 నదుల్లో రోడ్డుమార్గం ద్వారా చేపట్టిన సర్వే వివరాలు రాష్ట్రాల వారీగా డాల్ఫిన్ల సంఖ్య
ఉత్తరప్రదేశ్ 2,397
పంజాబ్ 3
పశ్చిమ బెంగాల్ 815
బిహార్ 2,220
అసోం 635
జార్ఖండ్ 162
రాజస్థాన్, మధ్యప్రదేశ్ 95