సాక్షి, కృష్ణా జిల్లా: యూట్యూబర్ ప్రశ్న రావణ్కు గన్నవరం కోర్టు.. ఈ నెల 18 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. రావణ్ను నెల్లూరు జైలుకు పోలీసులు తరలించారు. మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీసులు.. రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇప్పటికే నాలుగు కేసులో బెయిల్ రాగా, 5వ కేసులో కోర్టు రిమాండ్ విధించింది.
డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో బెయిల్పై విడుదలైన ప్రశ్న రావణ్ను ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత సంస్థ సీపీఐ (మావోయిస్ట్) సిద్ధాంతాలను ప్రశ్న రావణ్ ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకుడు, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఫిర్యాదు మేరకు శనివారం సాయంత్రం కేసు నమోదు చేశారు.
ఆ తరువాత గంటల వ్యవధిలోనే వేంపాడు టోల్గేట్ వద్ద రావణ్ను అదుపులోకి తీసుకుని తెల్లవారుజామున గన్నవరం పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. రావణ్పై సెక్షన్ 147, 148, 152, 192, 197(1), (డీ), 353(1), (బీ), బీఎన్ఎస్ 13, 39 యూఏఏ వంటి దేశద్రోహం నేరాలను నమోదు చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ నిషేధిత సంస్థ సీపీఐ(మావోయిస్టు)కు మద్దతుగా, వారి తీవ్రవాద సిద్ధాంతాలతో వీడియోలను ప్రచారం చేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
రావణ్ను గన్నవరం పోలీస్స్టేషన్కు తరలించిన సందర్భంగా బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఈ కేసులో ఫిర్యాదుదారుడైన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ అల్పాహారం, భోజనాలు సరఫరా చేయడం గమనార్హం. కాగా, దేశద్రోహం కేసులో రావణ్ను పోలీసులు ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రావణ్ను పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


