అనంతపురం అగ్రికల్చర్: కరువు ఘంటికలు మోగుతున్నాయి. ఖరీఫ్లో ఇప్పటి వరకు సాగులోకి వచ్చిన పంటలు అంతో ఇంతో చేతికి రావాలంటే ఆగస్టు వర్షాలే కీలకం. అయితే నెల దాటిపోయినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దిగుబడులు వచ్చే అవకాశం లేకుండాపోయింది. జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల కాలంలో 210 మి.మీకు గాను 42 శాతం లోటుతో 122 మి.మీ వర్షపాతం నమోదైంది. అందులో ప్రధానంగా నైరుతి ప్రవేశించిన జూన్ మొదటి 15 రోజుల్లోనే మంచి వర్షాలు పడటంతో ఆ సమయానికి 11 శాతం అధికంగా 68.4 మి.మీ నమోదైంది. పంటలు విత్తుకు కీలకమైన జూలైలో పరిస్థితి దారుణంగా తయారైంది. జూన్ 15 తర్వాత కనుమరుగైన వరుణుడి జాడ జూలై నెలంతా కనిపించలేదు. జూలైలో 64.3 మి.మీ గానూ 71 శాతం తక్కువగా కేవలం 18.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక ఆగస్టులో కూడా 84.4 మి.మీకు గాను 60 శాతం తక్కువగా 34 మి.మీ నమోదైంది. ఈ సీజన్లో మొత్తం మీద 12 వర్షపు రోజులు (రెయినీ డేస్) నమోదయ్యాయి. అందులో జూన్లోనే ఏడు ఉండగా.. మిగతా రెండు నెలల కాలంలో మరో ఐదు మాత్రమే ఉన్నాయి. పెద్దవడుగూరు, కూడేరులో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా 30 మండలాల్లో తక్కువగానే వర్షాలు కురిశాయి. మూడు నెలలు పూర్తయినా ఇప్పటికీ పుట్లూరు, యల్లనూరు, గుమ్మఘట్ట, వజ్రకరూరు, తాడిపత్రి, గుత్తి... ఈ ఆరు మండలాల్లో 60 నుంచి 75 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇక మిగిలి ఉన్న సెప్టెంబర్ నెలలో 111.6 మి.మీ మేర సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఎల్–నినో తీవ్రత అధికంగా ఉన్నందున సెప్టెంబర్లో కూడా సాధారణం నమోదయ్యే అవకాశం లేదంటున్నారు.
ఎల్–నినో ప్రభావంతో నిలిచిన నైరుతి రుతుపవనాలు
ఖరీఫ్ సీజన్లో 42 శాతం లోటు వర్షపాతం నమోదు
దుర్భర పరిస్థితులతో భయాందోళనలో రైతులు


