అనంతపురం అర్బన్: ‘మాపై దయ చూపి సమస్యలు పరిష్కరించండి సారూ’ అంటూ ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో పాటు డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీసీఓ అరుణకుమారి, సీపీఓ బాలాజీనాయక్, హౌసింగ్ పీడీ శైలజ, సర్వే శాఖ ఏడీ కనకరాజు, ఉపాధికల్పనాధికారి పల్లవి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 486 అర్జీలు స్వీకరించారు. వాటిలో రెవెన్యూకు సంబంధించి 255, ఇతర సమస్యలకు చెందినవి 231 ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని చెప్పారు.
వినతులు కొన్ని...
● ఉరవకొండలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో సరైన వసతులు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తున్నారని రవినాయక్ ఫిర్యాదు చేశాడు.
● బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం, కేకేఅగ్రహారం, సంజీవపురం, బొమ్మలాటపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వెంకటాపురం గ్రామానికి చెందిన జొన్న రామయ్య, తదితరులు ఫిర్యాదు చేశారు. తమ గ్రామాల మీద వెళ్తున్న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.
● ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద రుణం మంజూరైనా డబ్బులు ఖాతాలో జమ చేయలేదని అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఎం.పెద్దన్న ఫిర్యాదు చేశాడు.


