అనంతపురం: కంప్యూటర్ సైన్సెస్, అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన వారు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ‘సాఫ్ట్వేర్’ కొలువులు దక్కక చతికిలపడుతున్నారు. ఏపీఈఏపీ సెట్లో అర్హత సాధించిన వారిలో 80 శాతం మంది సీఎస్ఈ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ), డిజైన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ తదితర కోర్ బ్రాంచుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈసీఈ మినహా మిగిలిన కోర్ బ్రాంచ్ విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది.
8 శాతమే స్కిల్డ్ ఉద్యోగాలు
ఇంజినీరింగ్లో ప్రతి 100 సీట్లలో 80 శాతం మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్సెస్ వాటి అనుబంధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కొలువులు తగ్గుముఖం పట్టడంతో 8 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలిన వారు కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తక్కువ జీతంతో వచ్చే కొలువులు దక్కుతున్నా.. గణనీయమైన ప్యాకేజీ కావాలన్న ఆశతో అవకాశాలను వదులుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోడింగ్ లేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై సాధికారిత లేకపోవడంతో ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నాయి.
● బీటెక్ అనంతరం మూడు, నాలుగు సంవత్సరాల సమయాన్ని కాలయాపన చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల అనంతరం ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే.. ఈమధ్య కాలానికి ఉద్యోగం చేసినట్లు సర్వీస్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుభవం ఉందని చెబితే.. అందుకు తగ్గట్టు నైపుణ్యాలు లేనందున రెండు, మూడు నెలలకే ఇంటికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నైపుణ్యాలు పెంపొందించుకోకపోతే కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్ కోర్సుల్లో బీటెక్ పూర్తి చేసినా ఫలితం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నైపుణ్యం కలిగిన అధ్యాపకులేరీ?
బీటెక్ 2, 3, 4 సంవత్సరాల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు తప్పనిసరి. కంప్యూటర్ సైన్సెస్, ఐటీ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యం గల అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ వంటి ఐటీ ఆధారిత కోర్సులకు ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేసిన అధ్యాపకులు లేరు. ఏఐసీటీఈ మాత్రం ‘స్వయం’ (ఆన్లైన్) 20 కోర్సులు పూర్తి చేసిన వారు సీఎస్ఈ, వాటి ఆధారిత కోర్సుల్లో అధ్యాపకులుగా ఉండొచ్చని నిర్దేశించింది. ఈ కోర్సులు చేసి అధ్యాపకులుగా చెలామణి అవుతున్నారు. ఫలితంగా ఈ కోర్సుల విద్యార్థులకు తగిన శిక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు అధికంగా కంప్యూటర్ సైన్సెస్ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నా.. అందుకు అనుగుణంగా అధ్యాపకులు లేకపోవడంతో నైపుణ్యాల కొరత వేధిస్తోంది. సాఫ్ట్వేర్ కొలువులకు వెళ్లే అభ్యర్థులను నిమిషాల వ్యవధిలోనే కొత్త కోడ్ రాయాలని బహుళ జాతి కంపెనీలు నిర్దేశించి.. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. దీంతో సదరు అభ్యర్థులు నైపుణ్యాల లేమి కారణంగా ఇంటర్వ్యూల్లో విఫలమవుతున్నారు.
80 శాతం మంది కంప్యూటర్ సైన్సెస్, డేటా సైన్సెస్ వైపు మొగ్గు
ఆ కోర్సులు బోధించే అధ్యాపకుల్లో వెంటాడుతున్న నైపుణ్యాల కొరత
సాఫ్ట్వేర్ కొలువులు దక్కకనిరాశానిస్పృహలు
ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్న కోర్ బ్రాంచుల వైపు ఆసక్తి చూపనివిద్యార్థులు


