బుక్కరాయసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని బొమ్మలాటపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..సోమవారం మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన నాగభూషణ (37), కుళ్లాయప్ప (42), చాంద్బాషాలు ద్విచక్ర వాహనంలో నార్పలకు బయలుదేరారు. ఇదే సమయంలో నార్పల మండలం కేసేపల్లికి చెందిన ఎస్.అశోక్, ఎం.అశోక్ ద్విచక్ర వాహనంపై అనంతపురం వెళ్తున్నారు.బొమ్మలాటపల్లి సమీపంలో చెన్నంపల్లి క్రాస్ వద్ద ఎదురెదురుగా వీరి ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నాగభూషణ అక్కడికక్కడే మృతి చెందగా, కుళ్లాయప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఘటనలో చాంద్బాషాకు కూడా తీవ్ర గాయాలు కాగా ఎం. అశోక్, ఎస్. అశోక్కు స్వల్ప గాయాలయ్యాయి. నాగభూషణకు భార్య నిర్మల, ఓ కుమారుడు, కుమార్తె, కుళ్లాయప్పకు భార్య కృపాదేవి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిసింది.


