సాక్షి టాస్క్ఫోర్స్: పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. బెల్టుషాపులు అన్ని రకాల మద్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే స్థాయికి చేరాయి. ఎప్పుడు కావాలన్నా అందుబాటులో లభిస్తోంది. తాగునీటికై నా కొరత ఉంటుందేమో కానీ మద్యానికి కొదవ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 130కి పైగా బెల్టుషాపులు ఉన్నాయి. గ్రామాలలో పాల వ్యాన్లు ఎలా వెళ్తాయో అదే తరహాలో అధికార టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అనుచరుడు బృందాలుగా ఏర్పాటు చేసుకుని బెల్టుషాపులకు మందు సరఫరా చేస్తుండటం గమనార్హం.
ఏటా రూ.180 కోట్ల మద్యం అమ్మకాలు..
నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, కంబదూరు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం జనాభాలో 15 ఏళ్లు పైబడిన వారిలో సగటున 11.5 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు తేలింది. ఈ లెక్కన నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది మద్యం తాగుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఎకై ్సజ్ శాఖ తాజా త్రైమాసిక నివేదికల ప్రకారం జిల్లాలోనే కళ్యాణ దుర్గం, కంబదూరు సర్కిళ్ల పరిధిలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. సాధారణం కంటే దాదాపు 220 శాతం అధికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే మద్యం ప్రియులు ఎలా జుర్రేస్తున్నారో తెలుస్తోంది. రోజుకు 3,500 లీటర్ల ఐఎంఎల్ మద్యం అమ్ముడవుతుండగా, 4500 పైచిలుకు లీటర్ల బీర్ల వినియోగం జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రకారం ఏడాదికి నియోజకవర్గంలో సుమారు రూ.180 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా.
ఊరూరా బెల్టుషాపులు
అన్ని బ్రాండ్లూ అందుబాటులో
అదనపు ధరలతో బాదుడే బాదుడు
పేదల కష్టార్జితం.. మందుకే సర్వస్వం
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో
పోగేసుకుంటున్న ‘పచ్చ’ధనం
ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కిటికీలోంచి మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇదేమీ అధికారిక మద్యం షాపు కాదు. బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బెల్టుషాపు. ఇక్కడ ఏర్పాటు కావాల్సిన మద్యం దుకాణాన్ని కర్ణాటక సరిహద్దున ఉన్న వేపులపర్తికి తరలించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అనుచరుడు అంతా తానై కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులతో బెల్టుషాపులు పెట్టించి అదనపు ధరలతో మద్యం అమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎకై ్సజ్ శాఖ నిర్ణయించిన ధరలు ఎంహెచ్ బ్రాందీ క్వార్టర్ (180 ఎంఎల్) ధర రూ.210 కాగా బెల్టుషాపుల్లో రూ.250కి అమ్ముతున్నారు. ఎంసీ వీఎస్ఓపీ 90 ఎంఎల్ ధర రూ.110 కాగా అదనంగా రూ.40, రాయల్ స్టాగ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 కాగా రూ.270 వసూలు చేస్తున్నారు. ఇక కళ్యాణి బీర్ రూ.180, కేఎఫ్ అల్ట్రా బీర్ రూ.220, కేఎఫ్ స్ట్రాంగ్ బీర్ రూ.200 అయితే వీటికి రూ.40 అదనంగా వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.


