● సోషల్ మీడియా యాక్టివిస్టు
సంజీవరెడ్డికి మరోసారి
పోలీసు నోటీసు
బెళుగుప్ప: సోషల్ మీడియా కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. సర్కారు లోపాలను ప్రశ్నించడమే పాపమన్నట్లుగా వ్యవహరిస్తోంది. అక్రమ కేసులపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా లెక్కచేయడం లేదు. బెళుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు సంజీవ రెడ్డికి తాజాగా పోలీసులు నోటీ సులు అందించడమే ఇందుకు నిదర్శనం. వ్యవసాయంపై ఆధారపడి వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్న సంజీవ రెడ్డిని 2024 సెప్టెంబర్లో పుట్టపర్తి పోలీసులు నక్కలపల్లిలో అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆ తరువాత వరుసగా తిరుపతి, చిలకలూరిపేట, పార్వతిపురం, నగరి, ఆదోని, నంద్యాల, తాటికొండ, విజయ వాడ, అనకాపల్లి పోలీసుస్టేషన్లకు తీసుకెళ్లారు. మూడు నెలల పాటు తీవ్రంగా వేధించి విడుదల చేశారు. తాజాగా పులివెందుల, వేమూరు, కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన పోలీసులు నోటీసులు అందించడం గమనార్హం. ఓ సామాన్యుడిపై కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇళ్లు 7.43 లక్షలు..
జనాభా 22.33 లక్షలు
● జిల్లాలో ముగిసిన గృహగణన
అనంతపురం అర్బన్:జనగణనలో మొదటి దశలో భాగంగా చేపట్టిన గృహగణన ప్రక్రియ శనివారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా 7,43,264 ఇళ్లు ఉండగా, అందులో 82,965 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. తాళం వేసిన ఇళ్లు 949 ఉన్నాయి. మొత్తం జనాభా 22,33,405గా లెక్క తేల్చారు. 1,10,001 ఇళ్లను ఇతర పనులకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి నివాసం ఉన్న ఇళ్లు 5,39,635, కొంత భాగం నివాసమున్న గృహాలు 10,663 ఉన్నట్లు వెల్లడైంది.
స్టోర్ బియ్యం స్వాధీనం
అనంతపురం అర్బన్: రేషన్ కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తూ అక్రమంగా తరలిస్తున్న స్టోరు బియ్యాన్ని పౌర సరఫరాలశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాధ్యుడైన వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశారు. శనివారం స్థానిక మరువకొమ్మ కొట్టాల్లో కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అందుకు సీఎస్డీటీ సుబ్రమణ్యం దాడులు నిర్వహించారు. ఆటోతో పాటు అందులో ఉన్న ఆరు క్వింటాళ్ల (13 ప్యాకెట్లు) బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు బియ్యాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బియ్యం కిలో రూ.17తో కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఆటో డ్రైవర్ తెలిపాడని అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్ ఇచ్చిన వివరాల మేరకు జైపాల్రెడ్డి అనే వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు.


