అనంతపురం అగ్రికల్చర్: గతేడాది కన్నా కొంచెం ఎక్కువగానే కంది పంట సాగు అయ్యేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి సూచించారు. శనివారం స్థానిక కృషిభవన్లో అనంతపురం డివిజన్ పరిధిలో ఉన్న అనంతపురం, రాప్తాడు, బుక్కరాయసముద్రం, కూడేరు, గార్లదిన్నె, ఆత్మకూరు మండలాల పరిధిలో ఉన్న ఆర్ఎస్కే అసిస్టెంట్లకు ఖరీఫ్–2026 కార్యాచరణపై శిక్షణ ఇచ్చారు. కంది పంటను ప్రోత్సహిస్తూనే... ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించేలా రైతుల దృష్టిని మళ్లించి యూరియా, డీఏపీ ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలన్నారు. ఈ ఏడాది అన్ని రకాల ఎరువులు కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్ ద్వారానే సరఫరా, అమ్మకాలు చేపట్టాలన్నారు. పరిమితికి మించి ఎరువులు విక్రయించడానికి వీలులేదన్నారు. రోజువారీ నివేదికలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఇన్చార్జి ఏ.వెంకటకుమార్, ఏవోలు వంశీకృష్ణ, శ్యాంసుందరరెడ్డి, సోమశేఖర్, శుభకర్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన బీసీసీఐ శిక్షణ
అనంతపురం: బీసీసీఐ (సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్) అండర్–16 టీమ్ సీ కోచింగ్ క్యాంప్ శనివారం ముగిసింది. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మే 11 నుంచి జూన్ 06వ తేదీ వరకు రెసిడెన్షియల్ శిక్షణ కల్పించారు. హెడ్ కోచ్ హిమ్ జోషిపుర, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ రొనాల్డ్ రాయ్ రోడ్రిజియస్, ఫిజియోథెరఫిస్ట్ మేఘాన్ సింఘ్ చౌహాన్, వైభవ్ గోసామి, అనుష్క ఆదిత్య, అనలిస్ట్ కలై సెల్వన్ తదితరులు పాల్గొన్నారు.


