ప్రశాంతి నిలయం: శ్రీకృష్ణుడి లీలామృతాన్ని, భాగవత ఇతిహాస వైభవాన్ని చాటుతూ చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకం నయానందకరంగా సాగింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన మధ్యప్రదేశ్ సత్యసాయి భక్తులు శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత సామూహిక సత్యసాయి అష్టోత్తర శత నామావళిని పఠించారు. సామూహిక పఠనంతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అనంతరం భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం మధ్యప్రదేశ్ బాలవికాస్ చిన్నారులు వ్యాస మహర్షిచే రచించబడిన శ్రీమత్ భాగవతం, సత్యసాయిచే రచించబడిన భాగవత వాహిని నుంచి స్వీకరించిన భాగవత ఘట్టాలను ప్రదర్శంచారు. భాగవత్ కథామృతం పేరుతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. అనంతరం భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.


