ఉరవకొండ: ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించి తాను ‘వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్’ అని చంద్రబాబు నిరూపించుకున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం విడపనకల్లు మండల కేంద్రంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రజలను ఎలా వంచించారో ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేశారు. అంతకు ముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల క్రితం అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు.. అందులో ఒక్క హామీ కుడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఉచిత గ్యాస్, ఆడబిడ్డ నిధి లాంటి హామీలు అమలు చేయలేదన్నారు. రైతుల సంక్షేమాన్ని కూడా గాలికొదిలి వారిని మోసం చేశారన్నారు. అమరావతి పేరు మీద రూ.2 లక్షల కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు.అమరావతిపై దుబారా ఖర్చు తప్ప ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలో బెల్టుషాపు, ఎక్కడ పడితే అక్కడ జూద కేంద్రాలు వెలిశాయని పేర్కొన్నారు. రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారం మోపిందన్నారు. ప్రభుత్వ అవినీతిపై మాట్లాడితే రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారన్నారు. పార్టీ రీజనల్ అధికార ప్రతినిధి కె.వి.రమణ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి, అసత్యాల ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసగించారన్నారు. అమరాతి పేరుతో భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పరిశీలకులు ముత్తూలురు అశోక్, ఎంపీపీ కరణం పుష్పవతి, పార్టీ రాష్ట్ర నాయకులు కరణం భీమిరెడ్డి, హవళిగి భరత్రెడ్డి, సుంకన్న, ఓబుళప్ప, గిరిబాబు, నాగేంద్ర, సిద్దార్థ్, జనార్థన్రెడ్డి, ఎర్రిస్వామి, అనిల్, గోవప్ప, ఆది, అజిత్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి పేరుతో దుబారా ఖర్చు పెట్టి దోపిడీ చేస్తారా?
సూపర్ సిక్స్ హామీలు
గుర్తుకై నా ఉన్నాయా?
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం


