అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక తరగతుల ఉపాధ్యాయులకు జ్ఞాన ప్రకాశ్ ఇయర్–3 (ఎఫ్ఎల్ఎన్) శిక్షణ కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుత్తి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో మొత్తం ఏడు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన శిక్షణను ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ప్రారంభించి, మాట్లాడారు. పునాది దశలోని విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి అవసరమైన బోధనా విధానాలు, ఆధునిక విద్యా పద్ధతులు, తరగతి గది నిర్వహణ, విద్యార్థుల్లో భాషా, గణిత నైపుణ్యాల పెంపుపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సౌకర్యార్థం రాష్ట్ర అధికారుల సూచన మేరకు అనంతపురంలో అదనంగా మరో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సమగ్ర శిక్ష ఏఎంఓ వేణుగోపాల్ తెలిపారు. బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న విజయభారతి బీఈడీ కళాశాలలో శుక్రవారం నుంచి కొత్త శిక్షణ కేంద్రం ప్రారంభమవుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా అనంతపురం కేంద్రాన్ని ఎంపిక చేసుకున్న ఉపాధ్యాయులు మాత్రమే ఈ కేంద్రంలో శిక్షణకు హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే ఇతర కేంద్రాల్లో నమోదు చేసుకుని, తమకు అనుకూలమైన కేంద్రాలను ఎంపిక చేసుకున్న ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందొచ్చని తెలిపారు.


