అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 140 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు.
ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదు
● జేసీ విష్ణుచరణ్కు కేజీబీవీ సిబ్బంది ఫిర్యాదు
అనంతపురం అర్బన్: సమగ్రశిక్ష పరిధిలోని కస్తురిబా బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న 62 మందికి ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్కు బాధితులు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదికలో జేసీని సమగ్రశిక్ష, కేజీబీవీ ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ విజయ్, సిబ్బంది చిన్నరత్నమ్మ, చంద్రకళ, అశ్విని, ధరణి, వెంకటలక్ష్మి, పద్మావతి, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో తామంతా కొత్తగా విధుల్లోకి చేరామని తెలిపారు. తమకు ఆప్కాస్ ద్వారా వేతనం చెల్లించాల్సి ఉందని, అయితే ఇప్పటికీ ఆప్కాస్లో నమోదు చేయాలేదని వివరించారు. ఆరునెలలుగా వేతనం రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, కుటుంబపోషణ భారంగా మారిందని వాపోయారు. బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు తమ 62 మందిని ఆప్కాస్లో నమోదు చేయాలని కోరారు.


