మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
● మార్చి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
● ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష
రాయదుర్గంటౌన్: గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా విద్యనందించే ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు (ఏపీ మోడల్ స్కూల్) ఒక వరం. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలోని 15 ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు అవకాశం కల్పించింది. ఈ నెల 24 నుంచి మార్చి 31 వరకు htt ps://apms.apcfss.in లేదా www.cse.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఏ మండలంలోని విద్యార్థులకు ఆ మండలంలోని ఆదర్శ పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉన్న విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష అనంతరం ప్రతిభ, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం జిల్లా అధికారులు సీట్ల భర్తీకి ఏప్రిల్ 27న మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే విధానం
ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదివిన వారై ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి. దరఖాస్తుతోపాటు ఆధార్, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, రేషన్కార్డు, ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో, విద్యార్హత సర్టిఫికెట్తో పాటు హార్డ్ కాపీని ఆదర్శ పాఠశాలల్లో అందజేయాలి.


