ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం
అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థుల హడావుడి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ వార్షిక పరీక్షలు తొలిరోజు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 64 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలుగు/ సంస్కృతం/ ఉర్దూ/ హిందీ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 22,848 మందికి గాను 22,213 మంది హాజరయ్యారు. 632 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 2,306 మందికి గాను 2,166 మంది హాజరయ్యారు. 140 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఆనంద్ అనంతపురంలోని శ్రీసత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (బాలికల)లోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల్లోనూ పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్కు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ చేయాలని సూపరింటెండెంట్లను ఆదేశాలు జారీ చేశారు. అన్ని కేంద్రాల్లో మెడికల్ క్యాంపు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల ద్వారా పరీక్షలను పర్యవేక్షణ చేస్తున్నామని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ వెంకటరమణనాయక్ వివరించారు. ఆర్ఐఓ 3 కేంద్రాలు, జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి ఎస్వీఎస్ గురవయ్య శెట్టి 6, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 4, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 8, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 12 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఎస్ఎస్బీఎన్ పరీక్ష కేంద్రం తనిఖీ
అనంతపురం సెంట్రల్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. సోమవారం ఆయన ఎస్ఎస్బీఎన్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ప్రశ్న పత్రాలు భద్రపరిచే విధానం తదితర అంశాలపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం
ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం


