వేరొకరి పేరున భూమి ఎలా మారుస్తారు?
అనంతపురం అర్బన్: ‘ఒక సమస్యను మీరే సృష్టిస్తారు. దాన్ని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ బాధితులను తిప్పుకుంటారా..? ప్రభుత్వం ఒకరికి ఇచ్చిన భూమిని వేరొకరి పేరున ఎలా మారుస్తారు?’ అంటూ కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలం పంపనూరు గుట్టల్లో తనకు 14 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన రెండు ఎకరాల భూమిని వేరొకరిపేరున మార్చారని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు పర్వీన్ అనే మహిళ ఫిర్యాదు చేశారు. భూమికి సంబంధించి డి.పట్టా, పాసుపుస్తకం, అడంగల్, 1–బి తన పేరునే ఉన్నాయని తెలిపారు. భూమికి ఎన్ఓసీ ఇవ్వడంతో ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అయితే 2022లో ఈ భూమిని వేరకొరిపేరున ఆన్లైన్లో ఎక్కించారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం చేయలేదని వాపోయారు. ఆమె సమస్యపై కలెక్టర్ స్పందిస్తూ ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దార్ లక్ష్మీనాయక్ను పిలిపించి మాట్లాడారు. ఒకరిపేరున పట్టా ఉంటే వేరొకరి పేరును ఆన్లైన్లో ఎలా ఎక్కిస్తారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. సమస్యను పరిశీలించి తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.
అర్జీదారులతో కిటకిట
కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది. రెండు వారాలుగా కార్యక్రమం నిర్వహించకపోవడంతో ఈవారం పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్వో మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 696 అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే అందుకు బాధ్యులపై వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆర్డీఓ, తహసీల్దార్పై కలెక్టర్ ఆనంద్ ఆగ్రహం
తక్షణం సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
పరిష్కార వేదికకు వెల్లువలా అర్జీలు


