
లోటుపాట్లకు తావివ్వొద్దు
అనంతపురం అర్బన్: పంద్రాగస్టు పండుగ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొ ద్దని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాట్లను ఇన్చార్జ్ కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొటోకాల్, పోలీసు బందోబస్తుపై జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రదానం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జునుడు, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తులు
అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ క్రీడా దినోత్సవం–2025 పురస్కరించుకుని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులకు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారం ఎం.ప్రసాద్బాబు సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల క్రీడా ఫలితాల ఆధారంగా జిల్లాలో ఐదు పాఠశాలలకు ఉత్తమ అవార్డులు అందజేస్తామన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ప్రదర్శనలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గేమ్స్, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు (హెచ్ఎం, ఎస్ఏ (పీఈ), పీఈటీ సంతకంతో) జిరాక్స్ కాపీలు అందజేయాలన్నారు. టీం ఈవెంట్స్, వ్యక్తిగత ఈవెంట్స్ పాయింట్లు అనుబంధంలో ఇచ్చిన విధంగా పరిగణిస్తారన్నారు. ప్రతి క్రీడలో అత్యధిక స్కోరు సాధించిన పాఠశాలలు, మొత్తం స్కోరులో అగ్రస్థానంలో ఉన్న పాఠశాలలు అవార్డుకు అర్హులని తెలిపారు. డీఈఓ అధ్యక్షతన ఐదుగురి కమిటీ దరఖాస్తులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎంపికై న ఐదు పాఠశాలలకు జాతీయ క్రీడా దినోత్సవం రోజున (ఈనెల 29) అవార్డులు అందజేస్తామని తెలిపారు.
సీపీఐ జిల్లా కార్యదర్శిగా నారాయణస్వామి
అనంతపురం అర్బన్: సీపీఐ జిల్లా కార్యదర్శిగా పి.నారాయణస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా చిరుతల మల్లికార్జున, జె.రాజారెడ్డిని ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా మహాసభలు రెండో రోజు బుధవారం స్థానిక కనకదాస ఫంక్షన్ హాలులో నిర్వహించారు. సభల ముగింపు సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నారాయణస్వామి విద్యార్థి దశ నుంచి సీపీఐలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ శాఖల్లో వివిధ పదవులు నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా దాదాపు ఆరేళ్లు ఉన్నారు.
జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
అనంతపురం: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని న్యాయవాదులు విమర్శించారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు సి. హనుమన్న, బాలాజీ నాయక్, ఎం. కృష్టప్ప, ఎం. శ్రీనివాసులు, లక్ష్మణ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ ఎన్నికలను ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకుందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏజెంట్లు కూడా లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి దాసోహం అయిందని, పోలీసులను మహిళలు నిలదీసి, కాళ్లు పట్టుకున్నా ఓటు వేయడానికి అంగీకరించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వెంటనే కేంద్ర బలగాల భద్రతతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

లోటుపాట్లకు తావివ్వొద్దు

లోటుపాట్లకు తావివ్వొద్దు

లోటుపాట్లకు తావివ్వొద్దు

లోటుపాట్లకు తావివ్వొద్దు