అధికారులదీ అదే తీరు! | - | Sakshi
Sakshi News home page

అధికారులదీ అదే తీరు!

Apr 22 2025 12:48 AM | Updated on Apr 22 2025 12:48 AM

అధికారులదీ అదే తీరు!

అధికారులదీ అదే తీరు!

అనంతపురం అగ్రికల్చర్‌: పాలకుడు సమర్థుడైతే.. అధికారులు సైతం విధులు సక్రమంగా నిర్వరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారని పెద్దలు అంటుంటారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ పనితీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. యథా రాజా... తథా అధికారులు అనే విధంగా రైతు సంక్షేమాన్ని పట్టించుకోని కూటమి సర్కార్‌ బాటలోనే జిల్లా వ్యవసాయ శాఖ నడుస్తోంది. వ్యవసాయశాఖ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు రైతు దరికి చేరడం లేదు. గత ఖరీఫ్‌, రబీలో పూర్తి స్థాయిలో రాయితీ విత్తన వేరుశనగ, పప్పుశెనగ, కందులు, అలాగే ప్రత్యామ్నాయ విత్తనాలు అందించకుండానే చేతులెత్తేశారు. తాజాగా జిల్లాకు కేటాయించిన రూ.3 కోట్లు యాంత్రీకరణ బడ్జెట్‌ కూడా ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. యాంత్రీకరణ కింద రోటావీటర్లు, వివిధ రకాల స్ప్రేయర్లు, టిల్లర్లు, ఇతరత్రా పనిముట్లు రైతులకు చాలా వరకు అవసరం ఉన్నా... ప్రచార లోపం, సమన్వయం కొరవడటంతో ఇంకా రూ.1.30 కోట్లు బడ్జెట్‌ మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ యాంత్రీకరణ కింద 1,661 యూనిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రహసనంలా డ్రోన్ల మంజూరు..

ఆర్‌కేవీవై కింద జిల్లాకు కమ్యూనిటీ హైయరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ) గ్రూపులకు 80 శాతం రాయితీతో కిసాన్‌ డ్రోన్లు మంజూరు చేస్తామంటూ ఆరు నెలలుగా చెబుతున్నా... ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. 35 కిసాన్‌ డ్రోన్లు మంజూరుకు గాను డ్రాగో కంపెనీ డ్రోన్‌ ఖరీదు రూ.9.80 లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్‌ ఖరీదు రూ.9.81 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ప్రస్తుతం రైతు గ్రూపులు తమ వాటా కింద 50 శాతం చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పిస్తామంటున్నారు. డ్రోన్‌ ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత రైతుకు రాయితీ జమ చేస్తామని మెలికపెట్టడంతో ఇప్పటికిప్పుడు రూ.5 లక్షలు కట్టడానికి రైతు గ్రూపులు మొగ్గు చూపడం లేదు. అక్కడక్కడ కొందరు రైతులు ముందుకు వస్తున్నా... వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి తిరస్కరిస్తున్నారు. దీంతో కిసాన్‌ డ్రోన్ల మంజూరు కాస్త ఓ ప్రహసనంలా మారింది.

నత్తనడకన రైతు విశిష్ట సంఖ్య నమోదు..

ప్రతి రైతుకూ ఆధార్‌ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రక్రియ కాస్త సాంకేతిక సమస్యల కారణంగా మందకొడిగా సాగుతోంది. 3.40 లక్షల మందికి విశిష్ట సంఖ్య కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నా... 1.98 లక్షల మందికి పూర్తి చేశారు. దీని కోసం రైతులు ముందుకు వస్తున్నా యాప్‌ సక్రమంగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సమస్య పరిష్కారానికి అధికారులు మొగ్గు చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అందుబాటులో లేని అధికారులు..

పీఎం కిసాన్‌ కింద తమకు రూ.2 వేలు సొమ్ము జమ కావడం లేదని రోజూ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న రైతులకు అధికారులు అందుబాటులో ఉండటం లేదంటున్నారు. స్వయానా జిల్లా అధికారే కార్యాలయంలో గంట కూడా ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్‌, కమిషనర్‌ సమీక్షలు, జూమ్‌ కాన్ఫరెన్స్‌లు, క్యాంప్‌లంటూ ఉన్న సమయమంతా వారికే కేటాయించేస్తున్నారు. అన్నదాత సుఖీభవ, ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్‌, కరువు మండలాల ప్రకటన అంశంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తుంటే మరో పక్క వ్యవసాయశాఖ కూడా తన వంతు బాధ్యతగా సర్కారు బాటలోనే నడుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వ్యవసాయ పథకాల అమలులో

అడుగడుగునా అలసత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement