కొయ్యూరు: ప్రాసెసింగ్ ఫీజు పేరిట డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ’తల్లికి వందనం’ పథకం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.
మోసం చేసే తీరు ఇదే..
తల్లికి వందనం పథకంలో నగదు మంజూరైందని, ఆ నిధులను మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలంటే ప్రాసెసింగ్ ఫీజుగా కొంత సొమ్ము చెల్లించాలని సైబర్ నేరగాళ్లు నమ్మిస్తున్నారని ఎస్ఐ తెలిపారు. వాట్సాప్ సందేశాలు లేదా సాధారణ ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను సంప్రదించి డబ్బులు పంపాలని కోరుతున్నారని, అటువంటి వారి మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని హెచ్చరించారు. అపరిచితులు పంపే క్యూఆర్ కోడ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కాన్ చేయరాదన్నారు. అనుమానాస్పద లింకులు లేదా సందేశాలపై క్లిక్ చేయకూడదని సూచించారు. అలా చేస్తే ఖాతాలోని సొమ్ము మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. యూపీఐ పిన్ లేదా ఏటీఎం పిన్ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదన్నారు.
ఒకవేళ ఎవరైనా అజాగ్రత్తగా ఉండి సైబర్ మోసానికి గురై డబ్బులు కోల్పోతే, వెంటనే 1930 ఉచిత సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ సూచించారు. అలాగే సైబర్ నేరగాళ్లతో జరిపిన సంభాషణల వివరాలు, వారి ఫోన్ నంబర్లు, లావాదేవీల స్క్రీన్షాట్లను ఆధారాలుగా సురక్షితంగా భద్రపరచుకోవాలని స్పష్టం చేశారు.


