నక్కపల్లి: స్థానిక కేజీబీవీ పాఠశాలను సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీరాములు మంగళవారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో పలు అంశాలు మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకు వండి వడ్డించిన పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి భోజనం చేసి నాణ్యత రుచి చూశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా, పదార్థాలు శుచిగా ఉంటున్నాయా లేదా వంట సిబ్బంది విద్యార్థులతో ఏవిధంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ కేజీబీవీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని, ఉపాధ్యాయుల శిక్షణలో బాగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కేజీబీవీలో సీటు సంపాదించి చదువుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకుని సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. పాఠశాల ఆవరణలో గార్డెన్ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో కుంచం నరేష్, ప్రత్యేకాధికారి సలీమా పాల్గొన్నారు.


