యలమంచిలి రూరల్: కృష్ణా గోదావరి బేసిన్లో చమురు, సహజ వాయువు నిల్వల జాడ తెలుసుకునే నిమిత్తం మిషన్ అన్వేషణ్లో భాగంగా యలమంచిలి సమీపంలో చేపడుతున్న సెస్మిక్ సర్వేను గురువారం రైతులు అడ్డుకున్నారు. ఓఎన్జీసీ కోసం ఈ సర్వేను హైదరాబాద్కు చెందిన ఆల్హా జియో లిమిటెట్ సంస్థ చేపడుతోంది. కాంట్రాక్టు ప్రకారం భూమి అడుగు భాగంలో చమురు నిక్షేపాలు ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు 2డీ సెస్మిక్ డాటా సేకరిస్తున్నారు.గురువారం యలమంచిలి తులసీనగర్ సమీపంలో పంట పొలాల్లో సర్వే చేస్తున్న సమయంలో పెద్ద శబ్దాలు రావడం, భూమి కంపించినట్టు అనిపించడంతో ఆ ప్రాంతంలో స్థానికులు,రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే సర్వే జరిగిన ప్రాంతానికి వెళ్లి అడ్డుకోవడంతో పాటు సిబ్బందిని ప్రశ్నించారు. కొందరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సర్వే చేస్తున్న ప్రాంతాల్లో చిన్న సైజు క్లాస్ 2 పేలుడు పదార్థాలతో చిన్న రంధ్రాలు,స్వల్పమైన విద్యుదాఘాతాలను సృష్టించడం ద్వారా ఉత్పన్నమైన శక్తిని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్తో విశ్లేషిణ చేస్తారు.భూమి అడుగు పొరల్లో ఏమైనా చమురు,సహజ వాయువు నిల్వలు ఉంటే తెలుసుకుంటారు.అయితే ఈ సర్వేకు సంబంధించి రైతులకు ఉన్న అపోహలు తొలగించడానికి కాంట్రాక్టు సంస్థ ఎలాంటి ప్రయత్నం చేయకుండా వీలైనంత త్వరగా తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోవడానికి చూస్తోంది. కొన్ని చోట్ల పంటలు సాగులో ఉన్నాయి.సర్వే కారణంగా అవి దెబ్బతింటున్నాయి.వీటికి ఎంత నష్టపరిహారం ఇస్తున్నారనే దానిపై రైతులకు స్పష్ట ఇవ్వడంలేదు.దీంతో పాటు సర్వే చేసి తమ భూములు బలవంతంగా లాక్కుంటారన్న భయాందోళనలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.


