
కలెక్టరేట్లో మట్టి గణపతుల పంపిణీ
తుమ్మపాల: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కలెక్టరేట్లో ఉద్యోగులకు మంగళవారం ఉచితంగా మట్టి విగ్రహాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కోసం మట్టి విగ్రహాలను ప్రతి ఇంటిలోను ప్రతిష్టించి పూజలు చేయాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జల వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి.వి.ముంకర, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.